హైదరాబాద్: హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఒక మహిళ ఆధార్ కార్డు చూపించకపోవడంతో ఆమెకు వైద్య చికిత్స నిరాకరించిన హృదయవిదారక ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ జిల్లాలోని మారేడ్పల్లికి చెందిన ప్రమీల అనే మహిళ తన మైనర్ కుమార్తెతో కలిసి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లింది. అయితే, ఆమె వద్ద ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు.
కాగా, ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె వరసగా విషాదాలు ఎదుర్కొంది. ఈ బాధలను తట్టుకోలేక ఆ ఊర్లో ఎలా బతకాలో తెలియక, ప్రమీల తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్కు వెళ్లింది. ఆమె చిన్న చిన్న పనులు చేసి పొట్ట పోసుకుంది. పనులు లేనప్పుడు భిక్షాటన చేసింది. ఆశ్రయం కోసం ఇల్లు లేకపోవడంతో, ప్రమీల, ఆమె కుమార్తె ఉస్మానియా ఆసుపత్రి వెలుపల ఎక్కువ రోజులు భిక్షాటన చేస్తూ, దారిన వెళ్ళే వారిచ్చే ఆహారం మీద ఆధారపడి గడిపారు.
కాగా, ఈ ఘటనపై రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) సిద్ధిఖీ మీడియాతో మాట్లాడుతూ… ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించారు.
“సంబంధిత మహిళను ఒక వ్యక్తి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. మేము స్కానింగ్ అల్ట్రాసౌండ్ వంటి చికిత్స అందించాము. ఆమె తర్వాత వెళ్లిపోయింది. దురదృష్టవశాత్తు, ఆ వ్యక్తి ఆ మహిళను, ఆమె కుమార్తెను విడిచిపెట్టాడు. తరువాత, ఆమె బేగమ్ బజార్లో కనబడింది. ఈరోజు, ఆమె మళ్ళీ ఉస్మానియాకు తిరిగి వచ్చింది” అని RMO చెప్పారు. “ఆధార్ కార్డు లేనందున ఉస్మానియా ఆసుపత్రి ఆ మహిళకు ఎటువంటి చికిత్సను నిరాకరించలేదు. ఆ మహిళ ఆరోగ్యంగా ఉంది” అని RMO మీడియాకు తెలిపారు.
తక్షణ చికిత్సకు ఆదేశాలు
కాగా, ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఓ మహిళకు వైద్యం నిరాకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమీలకు సరైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు.