Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ…సీఎం రేవంత్‌ రెడ్డి!

Share It:

హైదరాబాద్: గత BRS హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐకి అప్పగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…అంతర్రాష్ట్ర సమస్యలు, వివిధ కేంద్ర, ప్రభుత్వ విభాగాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సముచితమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిధుల సేకరణలో పాల్గొన్నాయని ఆయన అన్నారు.

“కాబట్టి, స్పీకర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంటోంది. ఎందుకంటే, ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తోంది” అని సీఎం అన్నారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA),జ్యుడీషియల్ కమిషన్ నివేదికలు ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై లోతైన, మరింత సమగ్ర దర్యాప్తు అవసరాన్ని నొక్కిచెప్పాయని ఆయన అన్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. అలాగే NDSA, ఇతర ఏజెన్సీలు.. క్రిమినల్‌ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు.

NDSA నివేదిక ప్రకారంప్రాజెక్ట్ అమలులో నిర్లక్ష్యం, వాస్తవాలను అణచివేయడం, ఆర్థిక అవకతవకలను జస్టిస్ ఘోష్ కమిషన్ గుర్తించిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో నిర్మాణాత్మక లోపాలు జరిగాయని, ప్రణాళిక, అమలులో లోపాలకు మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని తేల్చిందని అన్నారు.

కాళేశ్వరంపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌… అవకతవకలకు సంబంధించి గత బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టాయని చెప్పారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలు ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై లోతైన, మరింత సమగ్రమైన దర్యాప్తు అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని తెలిపారు.

మరోవంక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంపై అసలు, వడ్డీ చెల్లింపు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.49,835 కోట్లు చెల్లించిందని, మొత్తం వడ్డీ రూ.29,956 కోట్లు కాగా, చెల్లించిన అసలు మొత్తం రూ.19,879 కోట్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రుణాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు పొందిందని ఆయన అన్నారు.

మునుపటి బిఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజీ స్థానాన్ని మార్చిందని, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం దీనికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు నిర్వచనాలను మార్చిందని సీఎం ఆరోపించారు.

కాగా, నిన్న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కమిషన్ సూచించింది. అంతకుముందు, జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై తమ వాదన వినిపించడానికి పార్టీకి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ జూలై 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై ఉన్న బహుళార్ధసాధక ప్రాజెక్టు. గత బిఆర్ఎస్ పాలనలో నిర్మించిన బ్యారేజీలకు నష్టం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారింది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.