న్యూఢిల్లీ: ప్రయాగ్రాజ్లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
‘న కామ్కే’,’న రామ్కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం పట్ల ఎలాంటి శ్రద్ధ లేదు” అని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
జ్యోతిర్పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి సంగమం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న ఒక రోజు తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శల దాడికి దిగింది.
ఈమేరకు పోలీస్ సూపరింటెండెంట్ (మాఘ మేళా) నీరజ్ పాండే మాట్లాడుతూ… అవిముక్తేశ్వరానంద స్వామీ ముందస్తు అనుమతి లేకుండా, బ్రిడ్జ్ నంబర్ 2 వద్ద బారికేడ్ను దాటి సుమారు 200-250 మంది అనుచరులతో స్నాన ఘట్టంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని తెలిపారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పినప్పటికీ, ఆయన ఆగడానికి నిరాకరించారని, ఆ తర్వాత పవిత్ర స్నానం చేయకుండానే తిరిగి వెళ్ళిపోయారని పాండే చెప్పారు. “పోలీస్ యంత్రాంగం అందరు సాధువులను, సన్యాసులను గౌరవిస్తుంది., కానీ భక్తుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత” అని ఆయన అన్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ… “శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద జీకి జరిగిన అవమానకరమైన సంఘటనతో మేమందరం బాధపడ్డాము. ఈ సంఘటన జరిగినప్పటి నుండి శంకరాచార్య జీ నిరాహార దీక్షలో ఉన్నారు, కానీ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేదు. ఏ ఇతర ప్రభుత్వమైనా ఇప్పటికి సిగ్గుపడి ఉండేది” అని అన్నారు.
స్వామి అవిముక్తేశ్వరానంద తమ ముందు తలవంచడం లేదనే ఏకైక కారణంతో మోడీ ప్రభుత్వం తన మొత్తం ట్రోల్ సైన్యాన్ని ఆయనపైకి ఉసిగొల్పిందని ఖేరా ఆరోపించారు.
“సాధువులు రాజుల ముందు తలవంచరు; రాజులే సాధువుల ముందు తలవంచుతారు. ఈ అవమానకరమైన సంఘటనపై ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. లేకపోతే, మీరు ‘సనాతని’ కాదు… మీరు ‘ధనాతని’. మిమ్మల్ని అలాగే గుర్తిస్తారు” అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. “శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద జీ చేసిన నేరం ఏమిటి? ఆయన మీ కీర్తిని గానం చేయరు, మిమ్మల్ని ఖండిస్తారు; సగం కట్టిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠను ఆయన వ్యతిరేకిస్తారు; మహాకుంభమేళాలో జరిగిన అవకతవకలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తుతారు; కోవిడ్ సమయంలో గంగామాత ఒడిలో తేలుతున్న మృతదేహాల గురించి ఆయన మాట్లాడారు” అని ఆయన అన్నారు.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్కు జెడ్+ భద్రత కల్పించే ప్రభుత్వం, స్వామి అవిముక్తేశ్వరానందను ‘షాహీ స్నాన్’ చేయకుండా అడ్డుకుందని ఖేరా అన్నారు.
“ప్రతి మతం కర్మ గురించి మాట్లాడుతుంది. హిందూ మతంలో కర్మకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది, కానీ మోడీ ప్రభుత్వానికి తమ కర్మ గురించి ఎలాంటి భయం లేదు. ఒడిశాలో, బీజేపీ కార్యకర్తలు ఒక ముస్లింను చంపిన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పోలీస్ స్టేషన్ బయట కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు.
ఉదయపూర్లో కన్హయ్య లాల్ జీ హత్యకు గురయ్యారు, ఆ సమయంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ సాహెబ్ ఆయన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి, కేసును ఎన్ఐఏకు అప్పగించారు, కానీ ఇప్పటికీ కన్హయ్య లాల్ జీకి న్యాయం జరగలేదు,” అని ఆయన అన్నారు.
“బీజేపీ మూర్ఖులను తన భక్తులుగా మార్చుకుంటుంది. భక్తులను మూర్ఖులను చేస్తుంది; దానికి ఇంతకు మించి ఏమీ తెలియదని” కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు.


