న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూస్క్లిక్ వార్తా సంస్థ, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 184 కోట్ల జరిమానా విధించింది. న్యూస్క్లిక్కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఈడీ పేర్కొంది. అంతేకాదు వారు తమ కథనాల ద్వారా “చైనా అనుకూల ప్రచారాన్ని” వ్యాప్తి చేశారనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), విదేశీ ఇన్వర్డ్ రెమిటెన్స్ల “ఉల్లంఘనలు”కు సంబంధించిన రెండు సంస్థలపై తీర్పు ప్రక్రియ (దర్యాప్తు ముగింపు) పూర్తి చేసిన తర్వాత FEMA న్యాయనిర్ణేత అథారిటీ ఈ ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉల్లంఘనలు గణనీయమైనవి, ఉద్దేశపూర్వకంగా, వ్యవస్థాగతంగా జరిగినవని, పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు మరియు నియంత్రణ అధికారులకు అందించిన చట్టబద్ధమైన ప్రకటనల ఉల్లంఘన ఇందులో ఉన్నాయని న్యాయనిర్ణేత అథారిటీ గమనించింది” అని అది తెలిపింది. ఈ పరిణామంపై న్యూస్ క్లిక్ నుండి తక్షణ స్పందన రాలేదు.
రికార్డులు, ఆధారాలను ED వివరణాత్మకంగా పరిశీలించిన తర్వాత జరిమానా విధించినట్లు ఏజెన్సీ తెలిపింది. కాగా, ఈ పోర్టల్పై ED ప్రత్యేక మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అసలు మొదట 2021 సెప్టెంబర్లో దేశ రాజధానిలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న న్యూస్ క్లిక్ ప్రాంగణంపై దాడి చేసింది. దానిపై FEMA కేసును కూడా దాఖలు చేసింది.
మనీలాండరింగ్ కేసులో పుర్కాయస్థతో సహా 25 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను ఏజెన్సీ నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఈ సంస్థలపై కూడా దర్యాప్తు చేశారు. పోర్టల్, దాని ప్రమోటర్ తమ కథనాల ద్వారా “చైనా అనుకూల ఎజెండాను ముందుకు తెస్తున్నారని” ఆరోపించడానికి 2023లో బిజెపి న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని ఉటంకించింది.
చైనా ప్రభుత్వ మీడియా యంత్రాంగంతో దగ్గరగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నుండి నిధులు పొందిన గ్లోబల్ నెట్వర్క్లో న్యూస్క్లిక్ పోర్టల్ భాగమని వార్తా కథనం పేర్కొంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఫైలింగ్లలో వ్యాపార కార్యకలాపాల స్వభావాన్ని “తప్పుగా సూచించడం” ద్వారా (కంపెనీ) రూ. 9.59 కోట్ల ఎఫ్డిఐని అందుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, తద్వారా ఫెమా నిబంధనలను దాటవేసిందని ED తెలిపింది.
కంపెనీ డైరెక్టర్ అయిన పుర్కాయస్థ ఆ సమయంలో వ్యాపార నిర్వహణ బాధ్యతలు వహించినట్టు గుర్తించారు. దీంతో FEMA (కంపెనీల ఉల్లంఘన) సెక్షన్ 42 కింద ఆయనను బాధ్యులుగా చేశారు.
