హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో టేక్ఓవర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, ఎల్అండ్టీ అప్పులను (సుమారు ₹13,000 కోట్లు) ప్రభుత్వం భరించి, 90% ఈక్విటీని తీసుకునేలా, మెట్రోను పూర్తిగా ప్రభుత్వపరం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన ఈక్విటీ పెట్టుబడి కోసం ఎల్ అండ్ టీకి రూ.2,000 కోట్లు కూడా చెల్లిస్తుంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి కావాలంటే మొదటి దశ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత.. మెట్రో విస్తరణ మరింత వేగంగా జరగనుంది.
ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో వచ్చిన తర్వాత.. మెట్రో విస్తరణ మరింత వేగవంతం అవుతుంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. రవాణా వ్యవస్థపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ప్రాజెక్టులకు కేంద్ర సహాయం పొందడం సులభం అవుతుంది. ఇది నగర అభివృద్ధికి కీలక నిర్ణయంగా భావిస్తోంది.
అంతేకాదు తెలంగాణ కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం కొత్త పథకాలను ప్రకటించింది. ఉద్యోగుల కోసం 1,056 కోట్ల రూపాయలతో మూలధనం ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పథకానికి అవసరమైన నిధులను కేటాయించనుంది. 1.20 కోట్ల ప్రమాద బీమాను వర్తింప చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగులు, పింఛను దారుల కోసం ఈ ఆరోగ్య పథకాన్ని రూపొందించింది. అలాగే ఆరోగ్య సేవలను పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 652 ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. 1,998 వ్యాధులకు క్యాష్ లెస్ చికిత్సలను అందచేయనున్నారు. దీంతో ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వర్గ సమావేశం ద్వారా సంకేతం పంపింది.
అలాగూ 2027 జనాభా లెక్కల సేకరణను చేపట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను కూడా మంత్రివర్గం చర్చించింది. గృహాల జాబితా ఆపరేషన్ మొదటి దశను మే 11 నుండి ప్రారంభించి జూన్ 9 వరకు కొనసాగించడానికి ఏర్పాట్లు చేసారు.
కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణం కోసం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లోనూ కాంగ్రెస్కు భూమిని కేటాయించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మదూర్ గ్రామంలో జెఎన్టియు కళాశాల కోసం 70 ఎకరాల భూమిని కూడా కేబినెట్ కేటాయించింది. ఖమ్మంలోని తిరుముల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి 20 ఎకరాల భూమిని కూడా కేబినెట్ కేటాయించింది.
హైటెక్ పండ్ల మార్కెట్, కొత్తగా 21 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు కూడా భూమిని కేటాయించింది. అంతేకాకుండా, రోడ్డు విస్తరణ కోసం 42 ఎకరాల రక్షణ భూమిని సేకరించడానికి పరిహారంగా 120 ఎకరాలను కేబినెట్ కేటాయించింది. 300 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా ఆమోదించారు.
జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను కూడా తెలంగాణ కేబినెట్ చర్చించింది. ఈ ఎన్నికలను రద్దు చేసే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని చెబుతున్నారు.


