న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, పాలస్తీనియన్ల కోరికకు భారత ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవలేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపించింది.
ఈమేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ మాట్లాడుతూ…మోడీ ప్రభుత్వం పాలస్తీనియన్ల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు వ్యక్తం చేసినప్పటికీ… వారిని “వదిలేసింది” అని ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఉంటున్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ తరలించడం తప్పని, ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని, గాజాలో పౌరులపై దాడులు “కనికరం లేకుండా” కొనసాగుతున్నాయని జైరాంరమేష్ అన్నారు. ఇరాన్పై వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ పరిశీలిస్తున్న నివేదికలను కూడా ఆయన ప్రస్తావించారు.
“అయినప్పటికీ ప్రధానమంత్రి తన మంచి స్నేహితుడు, తన దేశంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహును ఆలింగనం చేసుకోవడానికి రేపు ఇజ్రాయెల్ వెళ్తున్నారు” అని రమేష్ అన్నారు.
నెతన్యాహు ప్రభుత్వం న్యాయ స్వాతంత్య్రాన్ని బలహీనపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఇజ్రాయెల్ ప్రతిపక్ష సభ్యులు ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో మోడీ ప్రతిపాదిత ప్రసంగాన్ని బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని రమేష్ పేర్కొన్నారు.
పాలస్తీనా దేశాన్ని 1988 నవంబర్ 18న గుర్తించిన తొలి దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఆ దీర్ఘకాల వైఖరి నుండి వైదొలగుతుందని రమేష్ అన్నారు.
రేపు మోడీ ఇజ్రాయెల్కు చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ఆయన నెస్సెట్ను ఉద్దేశించి ప్రసంగించి, నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో చర్చలు జరపనున్నారు. కాగా, ఈ పర్యటన ఇజ్రాయెల్ దేశీయ రాజకీయాల్లో విమర్శల పాలైంది. ప్రోటోకాల్ ప్రకారం ఇజ్రాయెల్ ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించకపోతే భారత ప్రధానమంత్రి పార్లమెంటరీ ప్రసంగాన్ని బహిష్కరించవచ్చని ప్రతిపక్షంలోని వర్గాలు సూచించాయి. ఇదిలా ఉండగా…కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఇంకా బహిరంగంగా స్పందించలేదు.
