భారతదేశం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా, సామాజిక అంతరాలు మాత్రం ఇంకా అట్టడుగు స్థాయిలోనే వేళ్లూనుకుపోయి ఉన్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’ (NBER) వెల్లడించిన గణాంకాలు విస్తుగొలిపే వాస్తవాలను మన ముందుంచాయి.
దేశంలోని సుమారు 15 లక్షల నివాస ప్రాంతాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక, ‘నివాస వేరుచేయడం’ (Residential Segregation) వల్ల ప్రాథమిక ప్రజా సేవలు ఎలా అణగారిన వర్గాలకు దూరమవుతున్నాయో కళ్లకు కట్టింది. అదృశ్య విభజన రేఖలు గ్రామాల నుంచి మహానగరాల వరకు ముస్లింలు, షెడ్యూల్డ్ కులాలు (SCలు) నివసించే ప్రాంతాలు ఇతర వర్గాల నివాసాలకు వేరుగా ఉంటున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
దేశంలోని 26 శాతం ముస్లింలు, 17 శాతం ఎస్సీలు అత్యధికంగా తమ వర్గీయులే ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యారు. ఈ విభజన కేవలం సామాజికమైనది మాత్రమే కాదు, ఇది వనరుల పంపిణీలో ఒక “అదృశ్య వివక్ష”కు దారితీస్తోంది. అమెరికాలోని నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వర్ణ వివక్ష స్థాయికి సమానంగా మన దగ్గర ఈ మత, కుల ఆధారిత విభజన ఉండటం ఆందోళనకరం.వనరుల పంపిణీలో వైఫల్యం ప్రభుత్వాలు నిధుల కేటాయింపులను జిల్లా లేదా రాష్ట్ర స్థాయిని ప్రాతిపదికగా తీసుకుంటాయి. కానీ, అసలు సమస్య ‘పక్కవాడ’ (Neighbourhood) స్థాయిలో ఉత్పన్నమవుతోంది.
విద్య, వైద్యం: ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సెకండరీ పాఠశాలలు, ఆసుపత్రులు ఉండే అవకాశం ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోతోంది.మౌలిక సదుపాయాలు: ఎస్సీ కాలనీల్లో తాగునీటి కనెక్షన్లు 26 శాతం, మురుగునీటి పారుదల సౌకర్యాలు 28 శాతం తక్కువగా ఉండటం వ్యవస్థాత్మక నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.నిధులు మంజూరైనా, అవి ఏ వాడకు వెళ్లాలి అనే అంశంలో స్థానిక రాజకీయాలు, మధ్యవర్తుల ప్రభావం బలంగా ఉంటోంది. ఫలితంగా, అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు చేరకముందే ఆగిపోతున్నాయి.
పెనుప్రమాదంలో భవిష్యత్తు: ఈ నివాస వివక్ష కేవలం నేటి సౌకర్యాలకే పరిమితం కాదు; ఇది భావి తరాల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తోంది. పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల బాలికల విద్యాశాతం పడిపోతోంది. సరైన విద్య, ఆరోగ్య వసతులు లేని చోట పెరిగే పిల్లలు ఆర్థికంగా ఎదిగే అవకాశాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో సామాజిక ఎదుగుదల మందగించడానికి ఈ నివాస వేరుచేయడమే ప్రధాన కారణమని పరిశోధకులు విశ్లేషించారు.
మార్పు ఎక్కడ రావాలి? పాలసీ నిర్ణేతలు ఇకనైనా గణాంకాలను పైపైన చూడటం మానేయాలి. అభివృద్ధి సూచీలను కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా, ప్రతి వాడ (Micro-level) స్థాయిలో సమీక్షించాలి. రాజకీయ ప్రమేయం లేని నిష్పక్షపాత వనరుల పంపిణీ జరిగినప్పుడే ‘అందరికీ సమాన అవకాశాలు’ అనే రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది. నివాస ప్రాంతాల మధ్య ఉన్న ఈ వివక్ష గోడలను బద్దలు కొట్టకపోతే, దేశాభివృద్ధి కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైపోయే ప్రమాదం ఉంది.
— ముహమ్మద్ ముజాహిద్


