న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో తన రెండు రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశం,ఇజ్రాయెల్ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని పెంచుకున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, సైబర్ భద్రత, రక్షణ, కీలకమైన అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారం వంటి 17 ఒప్పందాలపై సంతకం చేశాయి.
సాంకేతికతల బదిలీ ఫ్రేమ్ వర్క్ ద్వారా మిలిటరీ హార్డ్వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపడుతూ.. తమ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత్-ఇజ్రాయెల్ కీలక, భవిష్యత్ సాంకేతికతల భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నట్లు మోదీ ప్రకటించారు.
పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వంతో భారత భద్రతా ప్రయోజనాలు నేరుగా ముడిపడి ఉన్నాయని.. నెతన్యాహుతో భేటీ అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మోదీ పేర్కొన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత మద్దతును పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదన్నారు. ప్రధానుల చర్చల అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటనను కూడా విడుదల చేశాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వైపు చర్చకు అంగీకరించాయి.
అయితే, కొన్ని భారతీయ మీడియా ఊహాగానాలకు విరుద్ధంగా, ఈ పర్యటన సందర్భంగా సంతకం చేసిన ఒప్పందాలలో ఏదీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ బదిలీ అంశమైతే లేదు.
న్యూఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య చర్చలు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా విస్తృత రక్షణ సాంకేతిక సహకారాన్ని అన్వేషించవచ్చని నివేదికలు సూచించినప్పటికీ, ఆచరణలో, ఇటువంటి బదిలీలు చట్టబద్ధంగా, సాంకేతికంగా సంక్లిష్టంగా ఉన్నాయని ది వైర్ వార్తాసంస్థ వివరించింది.
అమెరికా ప్రమేయం కారణంగా ఇజ్రాయెల్ కోర్ ఐరన్ డోమ్ టెక్నాలజీని యుఎస్ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా స్వేచ్ఛగా ఎగుమతి చేయదు.
ఐరన్ డోమ్ వ్యవస్థ US ఆర్థిక సహాయం,సహ-ఉత్పత్తి భాగస్వామ్యాలతో అభివృద్ధి చేశారు, అంటే భారతదేశం వంటి మూడవ పార్టీకి ఎగుమతి లేదా బదిలీకి సాధారణంగా అమెరికన్ ఎగుమతి-నియంత్రణ చట్టాల ప్రకారం అధికారిక US అనుమతి అవసరం.
బదులుగా, పర్యటన సమయంలో అంగీకరించిన రక్షణ సహకార ఫలితాలు, ఉత్పత్తి, సాంకేతిక భాగస్వామ్యం కోసం ఫ్రేమ్వర్క్లపై దృష్టి సారించాయి, ఐరన్ డోమ్ టెక్నాలజీని స్వయంగా అందించడానికి స్పష్టంగా కట్టుబడి ఉండవు.
ఐరన్ డోమ్ అంటే ఏమిటి?
ఐరన్ డోమ్ అనేది రాకెట్లు, ఫిరంగి గుండ్లు, డ్రోన్లను అడ్డగించడానికి రూపొంచిన ఇజ్రాయెల్ స్వల్ప-శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ. ఇది శత్రు దేశాలనుంచి రాబోయే ప్రమాదాలను ముందే గుర్తించడానికి వీలుగా రాడార్ను ఉపయోగిస్తుంది. వాటిని నాశనం చేయడానికి ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగిస్తుంది.
ఐరన్ బీమ్ అనేది ఐరన్ డోమ్ను పూర్తి చేయడానికి ఉద్దేశించిన కొత్త, లేజర్-ఆధారిత వ్యవస్థ. ఇది రాకెట్లు, డ్రోన్లను కూల్చివేసేందుకు అధిక-శక్తి లేజర్ను ఉపయోగిస్తుంది, క్షిపణి ఇంటర్సెప్టర్లకు తక్కువ-ధర ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
కాగా, మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై భారతదేశ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి, ఇజ్రాయెల్ పర్యటన భారతదేశ చారిత్రాత్మక విదేశాంగ విధాన సూత్రాలకు ద్రోహం చేసిందని పేర్కొన్నాయి.
ఏ ఒప్పందానికి, ఏ మానవీయ విలువకూ కట్టుబడని కర్కశ పాలకుడిగా నెతన్యాహు … ప్రపంచ దేశాల బహిష్కరణకు గురయ్యాడు. యుద్ధ నేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం 2024లో అతడిపై అరెస్టు వారెంటు జారీ చేసింది. ఐదు నెలల క్రితం ఐక్యరాజ్య సమితి వేదిక మీద అతడు ప్రసంగించబోతే- పలు దేశాల ప్రతినిధులు కుర్చీల్లోంచి లేచి వెళ్లిపోయారు. యుద్ధ పిపాసి మాటలు వినటం కూడా అమానవీయమే అవుతుందని బహిష్కరించారు. అలాంటి నెతన్యాహుని మోడీ ఒకటికి రెండుసార్లు గట్టిగా కౌగిలించుకొని, అతడిని ప్రియమైన మిత్రుడిగా సంబోధించిన సన్నివేశం భారత విదేశాంగ విధానానికి మాయని మచ్చగా మిగిలింది.


