న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కు క్లీన్చిట్ లభించింది. ఆయనతో మనీష్ సిసోడియాకు సైతం ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్టు వెలుపల కేజ్రీవాల్ కన్నీటిపర్యంతమయ్యారు.
కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ… తాను అవినీతిపరుడిని కాదని, సిసోడియా, తాము ఇద్దరం కూడా నిజాయితీ పరులమని కోర్టు వెల్లడించిందని అన్నారు. ఆప్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. తమపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా రాజకీయ కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆప్ పార్టీలో ఐదుగురు అగ్రనేతలను అంతం చేయాలని బిజెపి ప్రణాళిక వేసిందని, అదే సమయంలో ‘ఎప్పటికైనా సత్య విజయం సాధిస్తుంది’ అని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని అన్నారు.
ప్రతి ఛానెల్లో మమ్మల్ని నిందించారు. అవినీతిపరులన్నారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నేను నిజాయితీని మాత్రమే సంపాదించాను. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,ఆప్ నిజాయితీపరులని కోర్టు ఈరోజు పేర్కొంది. కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ‘కట్టర్ ఇమాందర్’అని కోర్టు ఉత్తర్వు రుజువు చేస్తుంది, ”అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
గతంలో ఆప్ ప్రభుత్వం రద్దుచేసిన ఎక్సైజ్ పాలసీని రూపొందించడం మరియు అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి, సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కేజ్రీవాల్ ఎటువంటి ఆధారలు లేవని, సిసోడియాపై ప్రాథమికంగా ఎటువంటి కేసు లేదని పేర్కొంటూ, దర్యాప్తులో సిబిఐ లోపభూయిష్టంగా వ్యవహరించిందని ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్ తీవ్రంగా విమర్శించారు.
మొత్తంగా సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించలేమని, తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని తేల్చి చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపై ఉన్న కేసులను కొట్టివేసింది.


