టెహ్రాన్: ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గిన కొన్ని గంటల తర్వాత, రెండు గ్యాస్ కేంద్రాలు, ఒక పైప్లైన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేశాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.
“జియోనిస్ట్,అమెరికన్ శత్రువులు జరుపుతున్నదాడులలో భాగంగా… ఇస్ఫహాన్లోని కావే వీధిలో ఉన్న గ్యాస్ పరిపాలనా భవనం, గ్యాస్ పీడన నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని” ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్లోని ఈ కేంద్రాలు “పాక్షికంగా దెబ్బతిన్నాయి” అని ఫార్స్ పేర్కొంది.
దేశ నైరుతి ప్రాంతంలోని ఖొర్రమ్షహర్ విద్యుత్ కేంద్రం గ్యాస్ పైప్లైన్ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని అది తెలిపింది.
“ఇరాక్ సరిహద్దు నగరమైన ఖొర్రమ్షహర్ గ్యాస్ పైప్లైన్ ప్రాసెసింగ్ స్టేషన్ వెలుపలి ప్రాంతంలోకి ఒక క్షిపణి దూసుకొచ్చిందని” ఆ నగర గవర్నర్ను ఉటంకిస్తూ ఫార్స్ నివేదించింది.
మౌలిక సదుపాయాలు సాధారణంగా పనిచేస్తున్నాయని,గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదని గవర్నర్ తెలిపారు.
టెహ్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు, ఇస్లామిక్ రిపబ్లిక్ విద్యుత్ ప్లాంట్లపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే, ఈ దాడులు జరిగాయని ఖొర్రమ్షహర్ గవర్నర్ అన్నారు.
వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరిస్తూ అమెరికా అధినే ఇచ్చిన రెండు రోజుల అల్టిమేటం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్ విషయంలో ట్రంప్ తన వైఖరిని ఆకస్మికంగా మార్చుకున్నారు. అయితే, యుద్ధాన్ని ముగించే దిశగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ మీడియా తెలిపింది.

