టెహ్రాన్: ఇస్లామాబాద్లో అమెరికాతో చర్చలు ప్రారంభించడానికి ముందు ఇరాన్ షరతులు విధించింది. లెబనాన్లో కాల్పుల విరమణను పొడిగించి, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయడం ద్వారా వాషింగ్టన్ తన కట్టుబాట్లను తప్పక గౌరవించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. అంతేకాదు “ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని” ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అంతకుముందు చెప్పారు.
“ఇరు పక్షాల మధ్య పరస్పరం అంగీకరించిన రెండు చర్యలు ఇంకా అమలు కాలేదు: చర్చలు ప్రారంభించడానికి ముందు లెబనాన్లో కాల్పుల విరమణ, స్థంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల,” అని మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ‘ఎక్స్ పోస్ట్లో రాశారు. “చర్చలు ప్రారంభమయ్యే ముందు ఈ రెండు విషయాలు తప్పక నెరవేర్చాలని ఆయన అన్నారు.”
అమెరికా, ఇరాన్ల మధ్య అంగీకరించిన రెండు వారాల కాల్పుల విరమణను శాశ్వత ఒప్పందంగా మార్చే చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్కు విమానం ఎక్కిన కొద్దిసేపటికే ఘాలిబాఫ్ ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్ రాజధానిలో ఇరాన్ ప్రతినిధి బృందానికి ఘాలిబాఫ్, అరాఘ్చీ నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు.
ఇరాన్ను వాన్స్ హెచ్చరిక
“వారు మాతో ఆడుకోవాలని చూస్తే, మా సంప్రదింపుల బృందం అంత సుముఖంగా లేదని వారికి తెలుస్తుందని” అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ హెచ్చరించారు.
బుధవారం నాడు కాల్పుల విరమణను మొదట ప్రకటించినప్పటి నుండి, అందులో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ వాదిస్తూ వస్తోంది. మార్చి ప్రారంభం నుండి లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో దాదాపు 1,900 మంది మరణించారు.
ఇరాన్, అమెరికాల మధ్య ప్రధాన మధ్యవర్తి అయిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, లెబనాన్ ఈ ఒప్పందంలో భాగమని, వాషింగ్టన్కు సమర్పించిన తమ 10-సూత్రాల శాంతి ప్రణాళికలో ఇది ఇరాన్ డిమాండ్లలో ఒకటని చెప్పారు.
కానీ, రెండు వారాల ఈ ఒప్పందంలో లెబనాన్ లేదని వైట్ హౌస్ ఖండించింది. వాన్స్ బుధవారం దీనిని ఒక “అపార్థం” అని, దీనికి టెహ్రాన్తో “ఎలాంటి సంబంధం లేదు” అని పేర్కొన్నారు.
స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడాన్ని చర్చలకు ముందస్తు షరతుగా ఇంతకుముందు బహిరంగంగా నిర్దేశించలేదు, అయినప్పటికీ పూర్తి ఆంక్షల ఉపశమనం ఇరాన్ 10 డిమాండ్లలో మరొకటి.

