న్యూఢిల్లీ: మణిపూర్లో 2003 నాటి జాతిపరమైన హింసకు సంబంధించి రెండు ప్రత్యేక విచారణ కోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మణిపూర్, అస్సాం ప్రభుత్వాలతో పాటు ఇతర అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పురోగతిని సమీక్షించింది. బాధితులు, వారి కుటుంబాలు, న్యాయవాదులు రికార్డులను పొందేందుకు వీలుగా, ఛార్జిషీట్లు దాఖలైన అన్ని కేసుల వివరాలను, కేసు నంబర్లు, ప్రస్తుత స్థితితో సహా క్రోడీకరించాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణకు ముందు స్థితిగతుల నివేదికను సమర్పించాలని సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను కోరింది.
ప్రత్యేక న్యాయమూర్తులు ఇప్పటికే సీబీఐ, ఎన్ఐఏ కేసులను విచారిస్తున్నప్పటికీ, ఆ కోర్టులు కేవలం మణిపూర్ హింసాకాండ కేసులను మాత్రమే విచారిస్తాయా లేక ఇతర కేసులను కూడా నిర్వహిస్తాయా అనేది అస్పష్టంగా ఉందని కోర్టు పేర్కొంది. “మణిపూర్ హింసాకాండకు సంబంధించి సీబీఐ కేసుల కోసం ఒకటి, ఎన్ఐఏ కేసుల కోసం మరొకటి, ఇలా రెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలించాలని” ధర్మాసనం ఆదేశించింది.
సీబీఐ 31 కేసులను దర్యాప్తు చేసిందని, వాటిలో 27 కేసులకు (22 ఛార్జిషీట్లు, ఐదు ముగింపు నివేదికలు) తుది నివేదికలు దాఖలు చేసిందని, మరో నాలుగు కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలియజేశారు. ఈ కేసులలో చాలా వరకు గౌహతికి బదిలీ చేశారు. 30 కేసులను విచారిస్తున్న ఎన్ఐఏ, 15 కేసులలో ఛార్జిషీట్లు దాఖలు చేసింది; మిగిలిన వాటిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఎన్ఐఏ కేసులలో ఏడింటిలో అభియోగాలు నమోదు చేశారు. ఢిల్లీ, గౌహతి, మణిపూర్లోని కోర్టులలో కేసులు పెండింగ్లో ఉన్నాయి.
భద్రతాపరమైన ఆందోళనలను కూడా ధర్మాసనం ప్రస్తావిస్తూ… ఎలాంటి అంతరాయం లేకుండా దర్యాప్తు చేయడానికి సీబీఐ, ఎన్ఐఏలకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆదేశించింది. మణిపూర్ పోలీసులు, భద్రతా దళాల సంయుక్త కృషి వల్ల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు చేయడం సాధ్యమయ్యాయి. విద్యార్థులతో సహా పౌరుల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.
బాధితులకు స్టేటస్ రిపోర్టులు, ఛార్జిషీట్లు అందడంలో జరుగుతున్న జాప్యంపై సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ అభ్యంతరాలు లేవనెత్తారు. 2023 నుంచి ఏర్పాటు చేసిన తమ పర్యవేక్షణ యంత్రాంగం కొనసాగుతోందని కోర్టు పునరుద్ఘాటించింది.
షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కోసం మైతేయ్ సమాజం చేస్తున్న డిమాండ్కు నిరసనగా జరిగిన గిరిజన సంఘీభావ యాత్ర అనంతరం, మణిపూర్లో 2023 మే 3న జాతి హింస చెలరేగింది. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

