Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

విద్యార్థులపై కాల్పులకు అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్!

Share It:

న్యూఢిల్లీ: పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా చేసే సాధారణ ప్రసంగం పట్ల ప్రతిపక్షానికి ఆసక్తి లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపడానికి ఎవరు అనుమతి ఇచ్చారో హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత 15 రోజులుగా పార్లమెంటుకు వచ్చి పోలీసు చర్యకు బాధ్యత వహించే “ధైర్యం” ప్రధాని నరేంద్ర మోదీకి గానీ, షాకు గానీ లేదని విమర్శించారు.

“ఢిల్లీలో మీ పట్ల జరిగిన వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉందని హోం మంత్రి గానీ, ప్రధాని గానీ భావించడం లేదన్న విషయాన్ని విద్యార్థులు గమనించి అర్థం చేసుకోవాలి,” అని గాంధీ అన్నారు. సాధారణ అంశాలపై షా పార్లమెంటులో ప్రసంగించగలరా లేదా అనేది ఇక్కడ సమస్య కాదని ఆయన పేర్కొన్నారు.

“ఢిల్లీలో మన పిల్లలపై కాల్పులు జరపడానికి ఎవరు అనుమతి ఇచ్చారో హోం మంత్రి షా స్పష్టం చేయాలి. ఆయనే హోం మంత్రి; అక్కడ పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిగాయి,” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

“అమిత్‌ షా గారే ఆ ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆయన బాధ్యులు అవుతారు, ఒకవేళ ఆయనకు తెలియకపోతే ఆయన అసమర్థులు అవుతారని” రాహుల్‌ గాంధీ అన్నారు. ఏది ఏమైనా షా పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు.

అంతేకాదు జంతర్ మంతర్ వద్ద నిరసన సమయంలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు మోదీ క్షమాపణ చెప్పాలని కూడా రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతిపక్షం సమాధానం కోరుతున్న మూడవ అంశంగా రామమందిర విరాళాల చోరీ ఆరోపణను ఆయన ప్రస్తావించారు.

విద్యార్థులపై పోలీసు చర్య, పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తూనే ఉందని, అయితే గత 14-15 రోజులుగా ప్రభుత్వం దీనిపై స్పందించడానికి అంగీకరించలేదని ఖర్గే అన్నారు. “మేము పదేపదే ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఆయన (షా) రాలేదు,” అని ఖర్గే పేర్కొన్నారు.

రామమందిర నిర్వహణ బాధ్యత వహించే ట్రస్ట్‌ను ప్రధానే ప్రకటించారు కాబట్టి, అక్కడ జరిగిన విరాళాల చోరీపై మోదీ ప్రకటన చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. “మోదీ గారికి అత్యంత సన్నిహితులైన ట్రస్టీల పర్యవేక్షణలోనే విరాళాల చోరీ జరిగింది. దోషులను శిక్షించాలని, ప్రధాని దీనిపై ప్రకటన చేయాలని మేము కోరాము, కానీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని” ఖర్గే అన్నారు.

లక్షలాది మంది ప్రజలకు రామమందిరంపై విశ్వాసం ఉన్నందున మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. “ఈ మూడు అంశాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మేము ఈ మూడు అంశాలపై పోరాడుతున్నాము. వీటిపై మేము దృఢంగా ఉన్నాము; ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలి,” అని ఖర్గే అన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.