Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాట్నాలో భారీ నిరసన!

Share It:

పాట్నా : ప్రతిపాదిత వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పాట్నాలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డుతో సంబంధం ఉన్న అన్ని మత, రాజకీయ సంస్థలు, సారూప్య రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. నిరసనకారులు బిల్లును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజం మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు.

రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరియు P.K. పాండే వంటి ప్రముఖ రాజకీయ నాయకులు నిరసనకు హాజరు కావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే బీజేపీ దాని మిత్ర పక్షాల నాయకులు మాత్రం హాజరు కాలేదు. ఈ అంశంపై ముస్లిం సమాజంలో వారి మౌనం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు వారికి ఆహ్వానాలు అందించలేదని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించడంలో ఇమారత్ షరియా బీహార్-ఒడిశా నుండి గణనీయమైన సహకారం లభించింది. AIMPLB సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, బీహార్- ఒడిశా అమీర్-ఎ-షరియత్ మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహ్మానీ వేదిక ముందు భాగంలో కూర్చుని కనిపించడం, ఈ సమస్య తీవ్రతను నొక్కి చెబుతుంది.

నిరసనకు హాజరైన ముఖ్య వ్యక్తులలో జమాతే-ఎ-ఇస్లామీ హింద్ చీఫ్ సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ, SDPI ఉపాధ్యక్షుడు ముహమ్మద్ షఫీ, జమాతే ఉపాధ్యక్షుడు మాలిక్ మొహతాసిమ్ ఖాన్, బోర్డు ప్రతినిధి డాక్టర్ ఖాసిం రసూల్ ఇలియాస్, మాజీ ఎంపీ ముహమ్మద్ అదీబ్, ఎంపీ ముహిబుల్లా నద్వి, అఖ్తరుల్ ఇమాన్, ఇమ్రాన్ మసూద్, అబూ తాలిబ్ రెహ్మానీ, బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ముజాద్దిది, మరియు మిల్లీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ మౌలానా అనిసుర్ రెహ్మాన్ ఖాస్మి ఉన్నారు. జమియత్ ఉలేమా-ఎ-హింద్ రెండు వర్గాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించాలన్న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ణయాన్ని కాదని ఇఫ్తార్‌ విందుకు హాజరైన కొంతమంది వ్యక్తులు కూడా ప్రదర్శనలో కనిపించారు. ముస్లిం సమాజంలో ప్రజల ఆగ్రహం పెరగడంతో, బహిష్కరణను ధిక్కరించిన సభ్యులపై బోర్డు క్రమశిక్షణా చర్యలు ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

బిల్లును ఖండించిన నేతలు
జమాతే-ఇ-ఇస్లామీ హింద్ చీఫ్, సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ, ఈ ర్యాలీ ప్రభుత్వానికి హెచ్చరికగా పనిచేస్తుందని నొక్కి చెబుతూ శక్తివంతమైన ప్రసంగం చేశారు. వక్ఫ్ (సవరణ) బిల్లును ఆయన ఖండించారు, దీనిని “ముస్లిం వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధం, అహేతుకమైనది” అని అభివర్ణించారు. ఈ బిల్లు ముస్లిం సమాజం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని అన్నారు. దీనిపై నిరంతరం నిరసనలు తెలుపుతూనే ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

“ఈ నిరసన ప్రారంభం మాత్రమే” అని హుస్సేనీ ప్రకటించారు. “ప్రభుత్వం వక్ఫ్ వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోకపోతే, మేము దేశవ్యాప్తంగా ఆందోళనను ప్రారంభిస్తాము. మేము మౌనంగా ఉండము. ఈ నల్ల చట్టాన్ని సహించము అని ఆయన అన్నారు.”

ఇమారత్ షరియా అధిపతి మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ కూడా ఇదే విధమైన ఆందోళనలను ప్రతిధ్వనిస్తూ, బిల్లు వక్ఫ్ ఆస్తులపై చూపే ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ నిరసన… బిల్లుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, మన రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, మనం ఎదుర్కొంటున్న అన్యాయానికి వ్యతిరేకంగా” అని ఆయన అన్నారు. “మేము ఈ బిల్లును సహించము, దానిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని రహ్మాని అన్నారు.”

శాంతియుతంగా నిరసన
వక్ఫ్‌ వ్యతిరేక నిరసన ప్రదర్శనలో కొన్నిసార్లు ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసినప్పటికీ, నిరసన శాంతియుతంగానే ముగిసింది. ముస్లిం సమాజానికి మించి బిల్లుకు విస్తృత వ్యతిరేకతను సూచిస్తూ SC/ST ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం అయ్యారు.

పాట్నా ప్రదర్శన విజయవంతంగా ముగిసిన తరువాత, AIMPLB మార్చి 29న విజయవాడలో తన తదుపరి ప్రధాన నిరసనను ప్రకటించింది. రాబోయే ప్రదర్శన బిజెపి మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఒత్తిడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.