బెంగళూరు: నకిలీ వార్తలు రాసేవారిపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసినట్లు రుజువైతే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. దీనిని ఈ వారం ప్రారంభంలో మంత్రివర్గం ముందు ఉంచారు.
ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి “సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నకిలీ వార్తలపై పూర్తి నిషేధించే” అధికారాలను ఇస్తుంది. నకిలీ వార్తలు… “ఒకరి ప్రకటనను తప్పుగా ఉటంకించడం, తప్పుగా నివేదించడం; వాస్తవాలను వక్రీకరించడానికి దారితీసే ఆడియో, వీడియోను సవరించడం, పూర్తిగా కల్పిత కంటెంట్” అని నిర్వచించారు.
ముసాయిదా చట్టం ప్రకారం తప్పుడు సమాచారం అంటే “అభిప్రాయాలు, మతపరమైన లేదా తాత్విక ప్రసంగాలు, వ్యంగ్యం, హాస్యం లేదా పేరడీ లేదా కళాత్మక వ్యక్తీకరణ,నిర్లక్ష్యంగా వాస్తవాన్ని తప్పుగా ప్రకటించడం”.
కర్ణాటక వెలుపల లేదా లోపల ఉన్న ఏ వ్యక్తి అయినా “ప్రజారోగ్యం, ప్రజా భద్రత, ప్రజా ప్రశాంతత లేదా స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల నిర్వహణకు పక్షపాతం కలిగించే” తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తే 2-5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి ప్రోత్సహిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
ముసాయిదా చట్టం ప్రకారం, కన్నడ & సాంస్కృతిక మంత్రి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నకిలీ వార్తలు సోషల్ మీడియా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తారు.
నేరాల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు, ఇవి బెయిల్ ఇవ్వవు. ప్రతి ప్రత్యేక కోర్టుకు కనీసం ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించడానికి చట్టం అనుమతిసతుంది. ఈ ప్రత్యేక కోర్టులు కేసుల విచారణ సమయంలో మధ్యవర్తులు మరియు మీడియా సంస్థలకు (ప్రచురణకర్తలు మరియు ప్రసారకర్తలు) నిలిపివేత ఆదేశాలను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి.
కాగా, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు “నకిలీ వార్తల సమస్యను పరిష్కరించలేవు”. ఇక భారతదేశ జనాభాలో 27% మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగదారులు భారతదేశంలో ఉన్నారని ముసాయిదా పేర్కొంది. “నేడు సోషల్ మీడియా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి, కానీ దాని ఉపయోగంలో జాగ్రత్త కూడా అవసరం.” “ఒక చిన్న నకిలీ వార్త మొత్తం దేశంలో గందరగోళం సృష్టించగలదు” అని కర్ణాటక ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది.
సనాతన చిహ్నాలను అగౌరవపరచడం, స్త్రీవాద వ్యతిరేకత
ప్రతిపాదిత చట్టం స్త్రీవాద వ్యతిరేకతతో సహా అభ్యంతరకరమైన, అశ్లీలమైన కంటెంట్ను నిషేధించడం గురించి కూడా మాట్లాడుతుంది. ఇది “సనాతన చిహ్నాలను, నమ్మకాలను అగౌరవపరిచే” కంటెంట్ను సోషల్ మీడియాలో ప్రచురించడాన్ని నిషేధించాలని కూడా పిలుపునిస్తుంది. “శాస్త్రం, చరిత్ర, మతం, తత్వశాస్త్రం, సాహిత్యానికి సంబంధించిన అంశాలపై ప్రామాణిక పరిశోధన ఆధారంగా” ఉన్న మెటీరియల్లు మాత్రమే అనుమతిస్తారు.