ముంబయి : మహారాష్ట్ర సముద్ర తీరంలో ఎకె-47 రైఫిళ్లు ఉన్న పడవ ఒకటి గురువారం తీవ్ర కలకలం రేపింది. ముంబయికి 200 కిమీ దూరంలోని రాయగఢ్లోని హరిహరేశ్వర్ బీచ్ ప్రాంతంలో ఈ అనుమానాస్పద పడవను గుర్తించారు. రైఫిళ్లతో పాటు పేలుడు పదార్థాలు, బుల్లెట్లు, ఆయుధాల విడి భాగాలున్నాయని చెప్పారు.
ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరివర్ధన ప్రాంతంలో పలువురు స్థానికులు ఈ పడవను గుర్తించారు. బోటులో సిబ్బంది ఎవరూ లేరని చెప్పారు. అనంతరం స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. రాయగఢ్ ఎస్పీ అశోక్ దుధే, ఇతర సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని.. బోటును తమ అధీనంలోకి తీసుకొన్నారు. తనిఖీలు చేయగా.. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పడవ లభించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
‘ఉగ్రకోణం లేదు’
రాయ్గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు.
‘పడవ వారిదే’
లేడి హాన్ అనే పేరుతో ఉన్న ఈ పడవ ఆస్ట్రేలియాకు చెందిన హనా లాండర్గన్ అనే మహిళకు చెందినదిగా గుర్తించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర పఢువీస్ తెలిపారు. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్ 26న మస్కట్ మీదుగా ఐరోపాకు బయల్దేరిన ఈ పడవలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సిబ్బందిని వేరే పడవ తరలించి అక్కడే వదిలేయగా ..అది హరిహరేశ్వర్ బీచ్కు కొట్టుకొచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారని ఫడ్నవీస్ వివరించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.
అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, ‘యాంటీ టెర్రర్ స్క్వాడ్’లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే ‘దహీ హండీ’, ‘వినాయక చవితి’ పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
WATCH | Maharashtra Deputy CM #DevendraFadnavis briefs on #Raigad boat discovery says we have full information about the boat.#ITVideo pic.twitter.com/4ovxRv3vrL
— IndiaToday (@IndiaToday) August 18, 2022