Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

దేశంలో ఏకపక్ష కూల్చివేతలు…న్యాయాన్ని అణిచివేయడమే!

Share It:

లక్నో: భారతదేశంలో కూల్చివేతలు వివాదాస్పదమైన పాలనా సాధనంగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా, డజన్ల కొద్దీ మదర్సాలు, ఇళ్ళు, మసీదులు చట్టబద్ధమైన ప్రక్రియను కాదని కూల్చివేసారు. భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ అధికారులు ఈ చర్యలను సమర్థిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని లేదా అణగారిన వర్గాలకు చెందిన వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధారాలు లేదా ముందస్తు నోటీసు లేకుండా నిర్వహించిన ఇటువంటి ఏకపక్ష కూల్చివేతలు తీవ్రమైన రాజ్యాంగ, మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో!
భూమి నిజంగా ఆక్రమణకు గురైతే, ఈ కట్టడాలను నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదు? విద్యుత్, నీటి కనెక్షన్లు ఎందుకు అందించారు. సంవత్సరాల తరబడి బిల్లులు ఎందుకు వసూలు చేశారు. కానీ అదే ఆస్తులను తరువాత చట్టవిరుద్ధంగా ఎందుకు ప్రకటించారు? నిందితులను శిక్షించే అధికారం అధికారులకు ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఉన్నతమా? మనం ఉదారవాద ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా లేదా నియంతృత్వంలో జీవిస్తున్నామా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.

‘బుల్డోజర్ న్యాయం’
నేరాలకు చట్టవిరుద్ధమైన శిక్షగా ఇళ్లను కూల్చివేసే ‘బుల్డోజర్ న్యాయం’ ఎక్కుగా చేపట్టడం అనేది సహజ న్యాయ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తుంది. దీనికి సంబంధించి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మునిసిపల్ కార్పొరేషన్ కేసుల విషయంలో మైలురాయిలాంటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కట్టడాల తొలగింపుకు న్యాయమైన విచారణ, సరైన నోటీసు, న్యాయ పర్యవేక్షణ అవసరమని ఎప్పుడో నిర్ధారించాయి.

అయినప్పటికీ, జావేద్ మొహమ్మద్ (ప్రయాగ్‌రాజ్), హసీనా బి (మధ్యప్రదేశ్) వంటి ఇటీవలి కేసులు ముస్లింలు, పేదల్లో వచ్చే అసమ్మతిని అణిచివేసేందుకు కూల్చివేతలు ఎలా ఆయుధంగా ఉపయోగించుకున్నారో చూపిస్తున్నాయి. పౌరులను శిక్షించడానికి ప్రభుత్వం కోర్టులను విస్మరించినప్పుడు, అది ప్రజాస్వామ్యాన్నే బలహీనపరుస్తుంది. ఈ వైఖరి రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను స్పష్టంగా విస్మరించడమే అవుతుంది. ఒక వ్యక్తిని అతని ఇంటిని కూల్చివేసి శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఇటువంటి చర్యలు ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ)ను ఉల్లంఘిస్తాయి, ఇందులో ఆశ్రయం పొందే హక్కు కూడా ఉంది. ICCPR ఆర్టికల్ 17 ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి ఆస్తిని కలిగి ఉండే హక్కు ఉంది. ఎవరూ అతని ఆస్తిని ఏకపక్షంగా కోల్పోకూడదు.

ముందస్తు వ్యక్తిగత నోటీసు లేకుండా కూల్చివేత, ప్రాథమిక సహజ న్యాయానికి విరుద్ధం. భారత దేశ చట్టాల ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే… అందుకు ప్రతీకారంగా ఆస్తిని కూల్చివేయడం సామూహిక శిక్షగా పరిగణిస్తారు. ఇది భారతదేశ చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదు. తగిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఆస్తులు, మదరసాలను బుల్డోజర్ చేయడం తప్పని పేర్కొంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఇది జాతీయ ధోరణిగా మారింది.

భారతదేశం ఒక ఉదారవాద ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నాయి, అయినప్పటికీ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే వారి ఆస్తులను కూల్చివేసి అణచివేస్తారు. ఉపాధి, విద్య, అభివృద్ధి వంటి అత్యవసర సమస్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా, రాష్ట్ర యంత్రాంగాన్ని… ఇళ్ళు, సంస్థలను బుల్డోజర్ చేయడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 25,000 మదర్సాలు ఉన్నాయి, వాటిలో 8,449 గుర్తింపు లేనివి. ఈ సంస్థలు సుమారు 2.8 మిలియన్ల విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. రుజువు లేకుండా మదర్సాలు, మసీదులు కూల్చివేస్తే… అది జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాకుండా మైనారిటీ వర్గాలలో భయానక వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు తప్ప ఏ వ్యక్తినీ శిక్షించకూడదు.. శారీరకంగా లేదా ఆర్థికంగా హాని చేయకూడదు అనేది చట్ట పాలన ప్రాథమిక సూత్రం. ఇటువంటప్పుడు అధికారులు ఎటువంటి సమర్థన లేకుండా ఇళ్లను ఎలా కూల్చగలరు? తప్పును సరిదిద్దే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ దాని ప్రధాన విధులను నిర్వర్తించడంలో న్యాయవ్యవస్థను ఎలా భర్తీ చేయగలదు?

2022 నుండి, దేశవ్యాప్తంగా 1,50,000 కంటే ఎక్కువ ఇళ్లు బుల్డోజర్ చర్య ద్వారా కూల్చివేశారు. దీని వలన 7,38,000 మంది నిరాశ్రయులయ్యారు. నిందితులకు న్యాయ వ్యవస్థ ద్వారా ఆరోపణలను సవాలు చేయడానికి అవకాశం లభించకముందే ఈ విధ్వంసం జరుగుతుంది. నివేదికల నుండి, ‘బుల్డోజర్ న్యాయం’ ముస్లిం సమాజాన్ని అసమానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు ‘బుల్డోజర్ న్యాయం’ను ప్రశంసించారు. బహిరంగంగా మద్దతు ఇచ్చారు.

చట్టం ముందు అందరూ సమానమే. ప్రభుత్వం కూడా చట్టానికి అతీతం కాదు అనేది న్యాయశాస్త్రం ప్రాథమిక సూత్రం. చట్టబద్ధమైన ప్రక్రియ, న్యాయమైన విధానం ఉండాలి, అంటే చట్టపరమైన ఆధారం. సరైన విచారణ లేకుండా శిక్షార్హమైన చర్య ఉండకూడదు.

రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దాటవేయకుండా రాజ్యాంగ హక్కులను సమర్థించడం ప్రభుత్వ విధి. గృహాలు, సంస్థలను బుల్డోజర్ చేయడానికి బదులుగా, అధికారులు సమానమైన అభివృద్ధి, ఉపాధి, విద్యపై దృష్టి పెట్టాలి. ఏకపక్ష కూల్చివేతలు ప్రమాదకరమైన ధోరణిని సృష్టిస్తాయి. భారతదేశం ప్రజాస్వామ్యంగా ఉండాలంటే, ఈ అదుపులేని అధికార దుర్వినియోగం అంతం కావాలి. ప్రభుత్వం క్రూరమైన బలప్రయోగం కంటే చట్టబద్ధమైన, పారదర్శక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో కాదు, ఆర్డర్ పేరుతో న్యాయాన్ని అణిచివేయలేము.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.