హైదరాబాద్ : వచ్చే ఏడాది కరీంనగర్ పట్టణంలో నుమాయిష్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ను కలిసి 2023లో నుమాయిష్ నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కరీంనగర్లో నుమాయిష్ను నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులను కోరారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్ వంటి అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో వ్యాపారానికి భారీ అవకాశాలున్నాయని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కూడా నిర్ధారణకు వచ్చి కరీంనగర్లో నుమాయిష్ నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 2023లో కరీంనగర్లో నుమాయిష్ నిర్వహిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. 82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటివరకూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఈ ఎగ్జిబిషన్ను కరీంనగర్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం, మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభాశంకర్, కార్యదర్శి సాయినాధ్ దయాకర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.