హైదరాబాద్: బీఆర్ఎస్ నేడు ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరణ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. వీరికిశంషాబాద్ విమానాశ్రయంలో మంత్రులతో సహా బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. వారికి విమానాశ్రయంలో హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. మరో విమానంలో నగరానికి చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్వాగతం పలికారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్కు చేరుకోగా, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు బుధవారం ఉదయం యాదాద్రి మీదుగా ఖమ్మం వెళ్లే ముందు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో అల్పాహార విందులో పాల్గొంటారు.
నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ…
ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. ఈ సభ ద్వారా సత్తా చాటాలని చూస్తోంది బీఆర్ఎస్.ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. ఐదు లక్షల మంది జనసమీకరణతో వంద ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం వెయ్యిమంది వాలంటీర్లను నిమించారు.
ఎనిమిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అదే సమయంలో.. ప్రస్తుతం దేశ ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి? వారికోసమంటూ తీసుకురావల్సిన పథకాలేంటన్నది ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత. ఆప్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ పార్టీల అధినేతలను ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్ లో వీరి తోనే తమ దోస్తీ ఉండబోతున్నట్టు సంకేతాలనిస్తున్నారు సీఎం కేసీఆర్.
జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాలను ఏకం చేసే దిశగా జరుగుతున్న ఈ సభ ద్వారా బీఆర్ఎస్ సారథ్యంలో సరికొత్త కూటమికి బీజంపడే అవకాశం కనిపిస్తోంది.