టెహ్రాన్: ఇరాన్పై యుద్ధ విరమణకు కుదిరిన మధ్యంతర ఒప్పందం “ముగిసిపోయింది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, కీలకమైన హర్ముజ్ జలసంధిని రాకపోకలకు తెరిచి ఉంచడమే లక్ష్యంగా ఇరాన్పై తాజా దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సైన్యం తెలిపింది. మంగళవారం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు సరుకు రవాణా నౌకలపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ తాజా దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. ఈ దాడులు ఇరాన్ దక్షిణ తీరంలోని అనేక నగరాలను వణికించాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
“హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే వారి సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు, యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్పై అదనపు దాడులు ప్రారంభించాయని” అమెరికా సైన్యానికి చెందిన మధ్యప్రాచ్య కమాండ్ అయిన సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఎక్స్ (X) లో రాసింది.
“ఒక కీలకమైన అంతర్జాతీయ జలమార్గంలో స్వేచ్ఛగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇటీవల జరిగిన అన్యాయమైన దురాక్రమణకు ఇరాన్ను అమెరికా జవాబుదారీగా చేస్తోంది.” మంగళవారం జరిపిన దాడుల కంటే బుధవారం ఇరాన్పై జరిపన దాడులు సంఖ్యలో ఎక్కువని, పేరు వెల్లడించని షరతుపై ఒక అమెరికా అధికారి రాయిటర్స్కు తెలిపారు.
“ఓడలపై ఇరాన్ జరిపిన బాంబు దాడికి ఇది ప్రతీకారం. ఇది మళ్లీ జరిగితే, పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది!” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో రాశారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులతో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, ప్రపంచ చమురు సరఫరాలలో ఐదవ వంతు ఈ జలసంధి గుండానే ప్రయాణించేది. ఈ జలసంధిపై నియంత్రణ, టెహ్రాన్కు అపారమైన బలాన్ని ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంతో ప్రతిష్టంభనను సృష్టించడానికి సమర్థవంతంగా వీలు కల్పించింది. ఓడలపై జరిగిన దాడులకు ఇరాన్ బాధ్యత వహించనప్పటికీ, చర్చలలో పైచేయి సాధించడానికి టెహ్రాన్ ఇటువంటి చర్యలను ఉపయోగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు అనుబంధంగా ఉన్న నూర్న్యూస్, ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ త్వరలో “భారీ దాడి” చేస్తుందని ఒక సైనిక మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. ఇదే హెచ్చరికను సుప్రీం లీడర్ అయతోల్లా మొజ్తబా ఖమేనీ సీనియర్ సలహాదారు కూడా పునరుద్ఘాటించారు. దురాక్రమణదారుడైన శత్రువు, అతని సహచరులను కఠినంగా శిక్షిస్తామని మొహ్సెన్ రెజాయీ Xలో రాశారు.
ఈ తాజా ఉద్రిక్తత, జూన్ 17న సంతకం చేసిన అవగాహన ఒప్పందానికి గండి కొట్టింది. నౌకా దాడులకు ప్రతీకారంగా, మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. బుధవారం టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు, అవగాహన ఒప్పందం ముగిసిపోయిందా అని ట్రంప్ను అడగ్గా…”ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నా మటుకు, అది ముగిసిపోయిందని నేను అనుకుంటున్నా అని అన్నారు.”
“ఒకవేళ మనం ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే, అది నిలబడుతుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు,” అని ట్రంప్ తర్వాత అన్నారు. “వారు చాలా నీచమైన వ్యక్తులుగా నాకు అనిపించారు.” అయితే, సైనిక చర్యను తీవ్రతరం చేస్తామని పదేపదే బెదిరించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన ట్రంప్, పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ వస్తుందని తాను ఊహించడం లేదని, శాశ్వత ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొనసాగుతాయో లేదో స్పష్టంగా తెలియదని అన్నారు.
యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని తాను అనుకోవడం లేదని కూడా ట్రంప్ అన్నారు: “ఏది జరిగినా అది చాలా త్వరగా ముగిసిపోతుంది… అది చమురుతో సహా అన్నింటినీ మరింత సురక్షితంగా మాత్రమే చేస్తుంది.” బుధవారం జరిగిన దాడుల కారణంగా, సెటిల్మెంట్ అనంతర ట్రేడింగ్లో చమురు ధరలు బ్యారెల్కు $1 కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ చివరిగా బ్యారెల్కు $79.28 వద్ద నిలిచాయి. అయినప్పటికీ, ధరలు ఏప్రిల్ చివరిలో బ్యారెల్కు $120 కంటే ఎక్కువగా ఉన్న గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువగానే ఉన్నాయి.

