న్యూఢిల్లీ: నీట్, CBSE పరీక్షలలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు “ఏదైనా జరిగితే” కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ హెచ్చరించింది.
మంత్రి ప్రధాన్కు రాసిన లేఖలో, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలే నిరసనకారులతో చర్చలు జరపాలని మంత్రిని కోరారు. వాంగ్చుక్ పరిస్థితి “అత్యంత విషమంగా” ఉందని పేర్కొన్నారు.
ప్రధాన్ రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనలో భాగంగా వాంగ్చుక్ జూన్ 28 నుండి దీక్ష చేస్తున్నారు. ఈమేరకు గోఖలే తెలిపిన మాట్లాడుతూ… దీక్ష ప్రారంభించినప్పటి నుండి వాంగ్చుక్ ఎనిమిది కిలోలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. “NEET పరీక్ష అక్రమాలు మరియు పేపర్ లీక్ల వల్ల కలిగిన ఒత్తిడి కారణంగా 12 మంది యువ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం… వ్యవస్థ వారిని నిరాశపరచడం వల్ల అమాయక ప్రాణాలు కోల్పోవడం గురించి మనం మాట్లాడుతున్నామని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.”
అంతేకాదు “ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయంలో మంత్రి అంగీకరించిన టీఎంసీ నేత గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో, ఇలాంటి వైఫల్యాల తర్వాత బాధ్యతాయుతమైన మంత్రి రాజీనామా చేయడం నైతిక చర్య అవుతుంది. మీరు కనీసం రాజీనామా ప్రతిపాదన కూడా చేయకపోవడం లక్షలాది మంది విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని అన్నారు. “మీరు రాజీనామా చేస్తారా లేదా అనేది మీ అంతరాత్మకు వదిలేయాల్సిన నిర్ణయం. అయితే, లక్షలాది మంది విద్యార్థుల తరపున వాంగ్చుక్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి కనీసం ఆయనతో చర్చలు కూడా జరపకపోవడం అత్యంత సిగ్గుచేటని టీఎంసీ నేత కేంద్ర మంత్రిని ఉద్దేశించి అన్నారు.”
వాంగ్చుక్తో మాట్లాడాలని ప్రధాన్ను కోరుతూ, లక్షలాది మంది విద్యార్థుల కోసం పోరాడుతున్న “నిజమైన గాంధేయవాది”గా గోఖలే ఆయనను అభివర్ణించారు. “మీరు, ప్రభుత్వం చేయగలిగిన, తప్పక చేయాల్సిన కనీస పని అదే” అని ఆయన పేర్కొన్నారు. వాంగ్చుక్, ఇతర నిరసనకారులకు పలువురు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపినప్పటికీ, మోదీ ప్రభుత్వం మాత్రం “సిగ్గుచేటైన,దయనీయమైన మౌనం” వహించిందని ఆయన అన్నారు.
టీఎంసీ నేత గోఖలే మాట్లాడుతూ…”కనీసం ఆయనతో మాట్లాడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి? సిగ్గులేని ప్రభుత్వం నుండి రాజీనామాను ఆశించడం కేవలం ఒక ఆశ మాత్రమే. కానీ వాంగ్చుక్ చనిపోయినా పర్వాలేదన్నట్లుగా వారు వ్యవహరించడం అత్యంత దారుణమైన విషయం. రెండు వారాల్లో ఆయన 8 కిలోలకు పైగా బరువు తగ్గారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. సోనమ్ వాంగ్చుక్కు ఏమైనా జరిగితే, కనీసం ఆయనను సంప్రదించనందుకు మోదీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.”
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాంగ్చుక్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మరుసటి రోజే ఈ విజ్ఞప్తి వెలువడింది. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపిన వివరాల ప్రకారం..వాంగ్చుక్కు ధైర్యంగా ఉండాలని దీదీ సూచించారు. విద్యార్థులకు న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమానికి తన సంఘీభావాన్ని ప్రకటించారు.
TMC లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా కూడా, వాంగ్చుక్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు; అంతకుముందు మొయిత్రా, TMC రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ జంతర్ మంతర్ను సందర్శించి సంఘీభావం తెలిపారు. మంగళవారానికి 18 రోజుల నిరాహార దీక్షను పూర్తి చేసుకున్న వాంగ్చుక్, నిరసన కొనసాగుతుండగా నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

