లాహోర్: క్లిష్ట పరిస్థితుల్లో జో రూట్ చక్కటి సెంచరీ సాధించాడు కానీ ఆఫ్ఘనిస్తాన్తో ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో ఆరు సిక్సులు, 12 ఫోర్లతో 177 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకంగా నిలిచాడు. కెప్టెన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 41, మహ్మద్ నబీ 40 పరుగులతో రాణించారు. అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, లివింగ్ స్టోన్ 2 వికెట్లు పడగొట్టగా ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
326 పరుగుల భారీ టార్గెట్ చేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఫస్ట్ డౌన్ లో వచ్చిన జేమి స్మిత్ వెంట వెంటనే ఔటయ్యారు. జో రూట్ బెన్ డకెట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రూట్ క్రీజులో పాతుకుపోయినా ఇంకో ఎండ్ నుంచి వికెట్లు పడుతూ పోయాయి. జో రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ తో 120 పరుగులు చేశాడు. డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, హారీ బ్రూక్ 25, ఓవర్టన్ 32, జోఫ్రా ఆర్చర్ 14, లివింగ్ స్టోన్ 10 పరుగులు చేశారు.
ఒక బంతి మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టు 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు నేలకూల్చి ఇంగ్లండ్ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ నబీకి రెండు, ఫజల్ హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్, గుల్బదీన్ నయీబ్ తలా ఒక వికెట్ తీశారు.
ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి రౌండ్ లోనే ఓడిపోవడం చాలా నిరాశపరిచిందని అన్నాడు. ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్లో ఇంగ్లాండ్కు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని.. కానీ మేము మా అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదన్నాడు. రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. కానీ మా జట్టులోని టాప్ 6 ఆటగాళ్లలో ఎవరూ అతనికి మద్దతు ఇవ్వలేదని అన్నాడు. తాము చివరి పది ఓవర్లలో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చామని.. అదే మా ఓటమికి కారణమని జోస్ బట్లర్ స్పష్టం చేశాడు.
కాగా, గ్రూప్ -బి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఒక్కో విజయం సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రెండు టీములు 3 పాయింట్లతో ఉన్నాయి. వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈనెల 28న ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్లో అడుగు పెడుతుంది.