న్యూఢిల్లీ: పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న తరువాత బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముస్లిం సమాజాన్ని, వారి సంస్థలను లక్ష్యంగా చేసుకున్న వైనం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద లక్ష్యాలను ఢీకొట్టగా, అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ముస్లిం సమాజాలలో తీవ్రమైన మానవ హక్కుల ఆందోళనలను రేకెత్తించాయి.
విషాదం తర్వాత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని అధికారులు మదర్సాలు, మసీదులు, ఇతర ముస్లిం మత సంస్థలను అధికారిక అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో లేదా ప్రైవేట్ భూమిలో చట్టవిరుద్ధంగా నిర్మించారనే కారణంతో వాటిపై దాడులు ప్రారంభించారు. గుజరాత్, రాజస్థాన్లలో నివసిస్తున్న ముస్లింలను అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా ముద్రవేశారు. అంతేకాదు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా భావిస్తూ…. బెంగాలీ మాట్లాడే ముస్లింలపై అధికారులు దాడులు ప్రారంభించారు.
అయితే కూల్చివేతలు, నిర్బంధాలు, సంస్థాగత మూసివేతలు వంటి చర్యలు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయని, ఇది విస్తృత హిందూత్వ రాజకీయ ఎజెండా కింద పరిపాలనా పక్షపాతాన్ని సూచిస్తుందని విమర్శకులు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో, నేపాల్తో సరిహద్దును పంచుకునే ఫిలిభిత్, శ్రావస్తి, బలరాంపూర్, బహ్రైచ్, సిద్ధార్థ్నగర్, లఖింపూర్ ఖేరి, మహారాజ్గంజ్ వంటి సరిహద్దు జిల్లాలలో మసీదులు, మదర్సాలు, ఈద్గాలతో సహా 350 కి పైగా మతపరమైన నిర్మాణాలను గుర్తించి వాటిని మూసివేయడం, కూల్చివేయడం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు, ఈ నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో చట్టవిరుద్ధంగా నిర్మించారని లేదా ప్రైవేట్ భూమిలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని చర్య తీసుకునే ముందు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం కూడా పేర్కొంది.
ఈ ఆస్తులను ప్రభుత్వ భూమిలో చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. అయితే, స్థానికులు, హక్కుల కార్యకర్తలు కూల్చివేతలు చాలావరకు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. చట్టపరమైన పరిష్కారానికి అర్ధవంతమైన అవకాశం కల్పించలేదని ఆరోపిస్తున్నారు. కూల్చివేతలు కేవలం పరిపాలనా చర్యలు మాత్రమే కాదని, మతపరమైన వివక్ష విస్తృత ప్రచారంలో భాగమని వారు వాదిస్తున్నారు.
ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ అధికారులు డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, పౌరి గర్హ్వాల్ జిల్లాల్లో 150 కి పైగా మదర్సాలను మూసివేసి, మిగతా వాటిని కూల్చివేశారు. ఈ మదర్సాలు నమోదు చేయలేదని, అధికారిక గుర్తింపు లేకుండా నడుస్తున్నాయని సమర్ధించుకున్నారు.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఉత్తరాఖండ్లో దాదాపు 500 అక్రమ, 450 నమోదు కాని మదర్సాలు ఉన్నాయి. కానీ విమర్శకులు ఇతర మత సమాజాలు నిర్వహించే క్రమబద్ధీకరించని సంస్థలపై ఇలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది వివక్షతనే సూచిస్తుందని ఎత్తి చూపుతున్నారు.
విద్యా ప్రమాణాలు, జవాబుదారీతనం నిర్ధారించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే, కూల్చివేతకు వెళ్లడం కంటే మదర్సాల క్రమబద్ధీకరణకు మద్దతు ఇవ్వాలని ముస్లిం సమాజ నాయకులు వాదిస్తున్నారు. అనేక మదర్సాలు అత్యంత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్నాయి.
అలాగే గుజరాత్లో 1,000 మందికి పైగా ముస్లింలను – ఎక్కువగా బెంగాలీ మాట్లాడేవారు, బంగ్లాదేశ్ జాతీయులుగా అనుమానించారు – అహ్మదాబాద్లోని చందోలా సరస్సు ప్రాంతంలో,సూరత్లోని కొన్ని ప్రాంతాల నుండి అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్బంధాల తర్వాత చందోలా సరస్సు, రాఖియాల్లోని ప్రధానంగా ముస్లిం పొరుగు ప్రాంతాలలో 2,500 కి పైగా ఇళ్లు, దుకాణాలు, గిడ్డంగులు, కర్మాగారాలను కూల్చివేశారు.
రాజస్థాన్లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,000 మందికి పైగా వ్యక్తులను వివిధ ప్రాంతాల నుండి అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్కు బహిష్కరణకు సన్నాహకంగా కనీసం 150 మందిని కోల్కతాకు తరలించారు.
ఈ పరిస్థితి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఢాకాలో ఉన్న ప్రముఖ వార్తాపత్రిక ది డైలీ స్టార్ ప్రకారం, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వంతో అధికారికంగా ఆందోళనలు వ్యక్తం చేసింది. బహిష్కరణ చర్యలలో సరైన ప్రక్రియ లేకపోవడంపై ఢాకా ఆందోళన వ్యక్తం చేసింది.
మే 7 నుంచి మే 9 మధ్య, భారతదేశ సరిహద్దు భద్రతా దళం (BSF) రోహింగ్యా శరణార్థులతో సహా దాదాపు 300 మందిని అనధికారిక సరిహద్దు పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ భూభాగంలోకి నెట్టివేసినట్లు కూడా నివేదికలు వెలువడ్డాయి.
ఢిల్లీలో, పోలీసులు 38 మంది రోహింగ్యా శరణార్థులను అదుపులోకి తీసుకుని అండమాన్ -నికోబార్ దీవులకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో వివాదం మరింత తీవ్రమైంది. మానవ హక్కుల సంస్థల ప్రకారం, ఈ వ్యక్తులను బంగాళాఖాతంలోని అంతర్జాతీయ జలాల్లోకి తీసుకెళ్లి సముద్రంలో వదిలిపెట్టారు, ఈ చర్య అమానవీయమైనది. అంతర్జాతీయ శరణార్థి చట్టాన్ని ఉల్లంఘించింది.


