బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆర్సీబీ విజయోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, దాదాపు 50 మంది గాయపడ్డారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత వారిని సత్కరించే కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. టిక్కెట్లు, పాస్లు ఉన్న వ్యక్తులకే స్టేడియంలోకి అనుమతించినప్పటికీ, భారీసంఖ్యలో అభిమానులు తమ క్రికెట్ హీరోలను చూసేందుకు ప్రాంగణంలోకి ఎగబడ్డారు.
ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం… స్టేడియం ప్రాంగణానికి సమీపంలో ఉన్న డ్రెయిన్పై ఉన్న తాత్కాలిక స్లాబ్పై సామర్థ్యానికి మించి అభిమానులు దానిపైకి చేరడంతో అది కాస్తా కూలిపోయిందని వర్గాలు తెలిపాయి. ఆకస్మికంగా కూలిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది, దీని ఫలితంగా అనేక మంది మరణించారు, గాయపడ్డారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తొక్కిసలాటలో 11 మంది మరణించారని ధృవీకరించారు. ఈ సంఘటనపై డిప్యూటీ కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం కూడా ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఈ విషాదంపై క్షమాపణలు కోరారు. తొక్కిసలాట జరగడంతో మేము 10-15 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించాము” అని ఆయన అన్నారు.
మృతులలో 13 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువకులు, మహిళలు ఉన్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో, ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు సహా ఆరుగురు మరణించినట్లు నిర్ధారించారు. వైదేహి ఆసుపత్రిలో నలుగురు మరణించినట్లు నివేదించగా, మణిపాల్ ఆసుపత్రిలో ఒకరు మరణించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు డి.కె. శివకుమార్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
కాంగ్రెస్ను నిందించిన బీజేపీ
జరిగిన విషాదంపై నైతిక బాధ్యత వహించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. జనాలను నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షం నిందించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసలాట తర్వాత చాలా మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జనసమూహ నియంత్రణ చర్యలు లేవు. ప్రాథమిక ఏర్పాట్లు అసలే లేవు. అంతా గందరగోళం మాత్రమే” అని బీజేపీ నేతలు ఎక్స్లో పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషాదం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.