వాషింగ్టన్: గాజా శాంతి ఒప్పందంలో భాగంగా మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు ఆయన తెలిపారు. దీంతో రెండేళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వమైన అడుగు అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా పేర్కొన్నారు.
ట్రంప్ ట్వీట్
ఈ ఒప్పందం ఫలితంగా గాజాలో ఉన్న బందీలు అతి త్వరలో విడుదల అవుతారు, ఇజ్రాయెల్ తమ దళాలను ఉపసంహరించుకుంటుంది, శాశ్వత శాంతి వైపు ఇవి మొదటి అడుగులు” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీకు థ్యాంక్స్” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ… ఈ నిర్ణయం ఇజ్రాయెల్కు గొప్పరోజు. “దేవుని సహాయంతో మేము బందీలందరినీ ఇంటికి తీసుకువస్తాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
మరోవంక శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, టర్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఒప్పందం ఫలితంగా గాజా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడికి దారితీసే ఒప్పందానికి తాము అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.
ట్రంప్ మద్దతుగల శాంతి ప్రణాళికపై రోజుల తరబడి జరిగిన చర్చల తర్వాత ఈజిప్టులో ఈ ఒప్పందం కుదిరింది, ఇది చివరికి యుద్ధానికి శాశ్వత ముగింపుకు దారితీస్తుందని, ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతిని తీసుకువస్తుందని పరిశీలకులు ఆశిస్తున్నారు.
బుధవారం షర్మ్ ఎల్-షేక్లో జరిగిన శాంతి చర్చల కోసం ట్రంప్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్ రావడం, యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ప్రణాళికలోని అత్యంత క్లిష్ట సమస్యలను లోతుగా పరిశీలించాలని సంధానకర్తలు లక్ష్యంగా పెట్టుకున్నారనే దానికి సంకేతం. నెతన్యాహు ఉన్నత సలహాదారు రాన్ డెర్మెర్ కూడా చర్చలకు హాజరయ్యారు.
మొత్తంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇది మూడవ కాల్పుల విరమణ. మొదటిది నవంబర్ 2023లో, పాలస్తీనా ఖైదీలకు బదులుగా 100 మందికి పైగా బందీలను విడిపించారు. రెండవది ఈ సంవత్సరం జనవరి- ఫిబ్రవరిలో పాలస్తీనా మిలిటెంట్లు దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా 25 మంది ఇజ్రాయెల్ బందీలను,మరో ఎనిమిది మంది మృతదేహాలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ మార్చిలో ఆకస్మిక బాంబు దాడితో ఆ కాల్పుల విరమణను ముగించింది.