న్యూఢిల్లీ: నేటి బాలలే రేపటి పౌరులు. పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి మొదటి మెట్టు… వంటి నినాదాలు మన చెవులకు ఇంపుగా అనిపిస్తాయి. అయితే పేద పిల్లలు ఎక్కుగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతో ఉంది. తగు సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటు చేయడం, టీచర్లు, సిబ్బందిని నియమించడం, సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయంపై చేసిన సర్వేలో చేదు నిజాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా లక్షకు పైగా సింగిల్-టీచర్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 33 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అధికారిక డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ అత్యధిక సంఖ్యలో ఏకోపాధ్యా పాఠశాలలను ఉండగా, ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సింగిల్ టీచర్ స్కూళ్లలో చదువుకుంటున్నారు.
విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో, భారతదేశంలో ఒకే ఉపాధ్యాయుడితో నిర్వహిస్తున్న స్కూళ్లు 1,04,125 పాఠశాలలు ఉన్నాయి. కాగా, అటువంటి పాఠశాలలు 33,76,769 మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి – సగటున ఒక్కో పాఠశాలకు 34 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యా హక్కు చట్టం, 2009 ప్రాథమిక స్థాయిలో (I-V తరగతులు) 30:1, ఉన్నత ప్రాథమిక స్థాయిలో (VI-VIII తరగతులు) 35:1 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (PTR)ను తప్పనిసరి చేసింది. దేశంలో అత్యధిక సంఖ్యలో “సింగిల్-టీచర్” పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తరువాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, లక్షద్వీప్లు ఉన్నాయి.
అయితే, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల నమోదు విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, తరువాత జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
సింగిల్-టీచర్ పాఠశాలల సంఖ్య 2022-23లో 1,18,190 నుండి 2023-24లో 1,10,971కి తగ్గింది, ఇది దాదాపు ఆరు శాతం తగ్గుదలను నమోదు చేసింది.
“పాఠశాలల హేతుబద్ధీకరణ” పేరిట పాఠశాలల విలీనాలు, ఏకీకరణ ద్వారా అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది” అని ఒక సీనియర్ అధికారి వివరించారు.
“సింగిల్-టీచర్ పాఠశాలలు బోధనా అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల సరైన ఉపాధ్యాయ లభ్యతను నిర్ధారించడానికి సున్నా విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను సింగిల్-టీచర్ పాఠశాలలకు తిరిగి నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో 12,912 సింగిల్-టీచర్ పాఠశాలలు, ఉత్తరప్రదేశ్లో 9,508, జార్ఖండ్లో 9,1720, మహారాష్ట్రలో 8,152, కర్ణాటకలో 7,349, లక్షద్వీప్లో 7,217, మధ్యప్రదేశ్లో 7,217, పశ్చిమ బెంగాల్లో 6,482, రాజస్థాన్లో 6,117, ఛత్తీస్గఢ్లో 5,973, తెలంగాణలో 5,001 ఉన్నాయి. ఢిల్లీలో తొమ్మిది సింగిల్-టీచర్ పాఠశాలలు ఉన్నాయి.
పుదుచ్చేరి, లడఖ్, దాద్రా- నగర్ హవేలిలోని కేంద్రపాలిత ప్రాంతాలలో సింగిల్-టీచర్ పాఠశాలలు లేవు. అండమాన్ – నికోబార్ దీవులలో కేవలం నాలుగు సింగిల్-టీచర్ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి.
సింగిల్-టీచర్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పరంగా…ఉత్తరప్రదేశ్ 6,24,327 మంది విద్యార్థులతో ముందంజలో ఉంది, జార్ఖండ్ 4,36,480 మంది విద్యార్థులతో, పశ్చిమ బెంగాల్ 2,35,494, మధ్యప్రదేశ్ 2,29,095, కర్ణాటక 2,23,142, ఆంధ్రప్రదేశ్ 1,97,113, మరియు రాజస్థాన్ 1,72,071, ఇతర వాటితో పాటు ఉన్నాయి.
ప్రతి పాఠశాలకు సగటు విద్యార్థుల నమోదు విషయానికి వస్తే, చండీగఢ్, ఢిల్లీ వరుసగా 1,222, 808 మంది విద్యార్థులతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. మరోవైపు లడఖ్లో 59, మిజోరాంలో 70, మేఘాలయలో 73, హిమాచల్ ప్రదేశ్లో 82 మందితో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.



