బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ఇటువంటి చర్యలు భారతదేశ ఐక్యతకు మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ 4న ముఖ్యమంత్రికి రాసిన లేఖలో…రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన శాఖలను ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాలలో నడుపుతోందని ఆరోపించారు. అక్కడ “పిల్లలు, యువత మనస్సులలో ప్రతికూల ఆలోచనలు నాటుతున్నారని” కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక ఖర్గే ఆరోపించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం మీడియాకు ఈ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో ముఖ్యమంత్రి రాసిన నోట్స్ను అధికారులు పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం “భారతదేశ ఐక్యత, లౌకికవాదానికి విరుద్ధంగా ఉంది” అని ఖర్గే అన్నారు.
“ప్రజలలో ద్వేషాన్ని నాటుతున్న విభజన శక్తులు బలపడినప్పుడు, సమగ్రత, సమానత్వం, ఐక్యత అనే ప్రధాన సూత్రాలపై నిర్మితమైన మన రాజ్యాంగం… అటువంటి అంశాలను అరికట్టడానికి , దేశ లౌకిక విలువలను నిలబెట్టడానికి మనకు అధికారాన్ని ఇస్తుంది” అని మంత్రి రాశారు.
“పోలీసుల అనుమతి లేకుండా, లాఠీలు పట్టుకుని దుందుడుకు ప్రదర్శనలు జరుగుతున్నాయి” అని ఆయన ఆరోపించారు, ఇది “పిల్లలు, యువకులపై హానికరమైన మానసిక ప్రభావాన్ని చూపుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
“దేశ పిల్లలు, యువత, ప్రజలు,మొత్తం సమాజ శ్రేయస్సు దృష్ట్యా… ‘శాఖ’, ‘సంఘిక్’, ‘బైఠక్’ పేరుతో RSS నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని ఖర్గే లేఖలో అన్నారు.
నిషేధం “ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ-సహాయక పాఠశాలలు, ప్రజా ఆట స్థలాలు, ఉద్యానవనాలు, ముజ్రాయి శాఖ పరిధిలోని దేవాలయాలు, పురావస్తు శాఖ పరిధిలోని స్థలాలు, ఏదైనా ఇతర ప్రభుత్వ ప్రాంగణాలో” ఆర్ఎస్ఎస్ కార్యకలపాలనువిస్తరించకుండా నిషేధం విధించాలని ఆయన అన్నారు.
లౌకిక, ప్రజాస్వామ్య విలువలు రక్షించే నిమిత్తం… విభజనను వ్యాప్తి చేసే శక్తులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి రాష్ట్రానికి రాజ్యాంగం అధికారం ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ఏడాది పొడవునా తన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెగా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ లేఖ రావడం గమనార్హం.
ఈమేరకు ప్రియాంక ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ బహిరంగ ప్రదేశాలలో, ముఖ్యంగా అభ్యంతరకరమైన నినాదాలు చేస్తూ కర్రలతో రోడ్డుపై కవాతు లాంటి కార్యక్రమాలను నిర్వహణకు అనుమతించకూడదని ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా అభ్యర్థించినట్లు ఖర్గే చెప్పారు.
“ప్రైవేట్ పాఠశాలల్లో లేదా ఏదైనా ప్రైవేటు స్థలంలో వారు దీన్ని చేసుకోనివ్వండి. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని ఆయన బెంగళూరులో విలేకరులతో అన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతారని, “మతవాదపు విష బీజాలను నాటుతున్నారని” మంత్రి ఆరోపించారు.
గత 10 సంవత్సరాలలో దేశం పతనాన్ని మాత్రమే చూసిందని, ఆర్థిక అసమానత పెరిగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన విజయదశమి ప్రసంగంలో చెప్పారని ఖర్గే పేర్కొన్నారు.
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ఖర్గే అభ్యర్థనను ఆమోదించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు ఉండాలని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి, కానీ ఆర్ఎస్ఎస్ సభ్యులు ముందస్తు అనుమతి లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ అయిన యతీంద్ర ఆదివారం రాయచూర్లో విలేకరులతో అన్నారు.
ఆర్ఎస్ఎస్ను ఎవరూ ప్రశ్నించలేదు లేదా ఆపలేదు. వారు ఇప్పటివరకు అలాగే కొనసాగించారని ఆయన అన్నారు.
“కాబట్టి, దానిపై పరిమితి ఉండాలి. వారు కార్యక్రమాలను యాదృచ్ఛికంగా నిర్వహించరు. వారు వాటిని విషపూరిత భావజాలంతో నిర్వహిస్తున్నారు” అని యతీంద్ర అన్నారు.
ప్రియాంక ఖర్గేపై బిజెపి తీవ్ర విమర్శలు
కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ, “ఖర్గే ముఖ్యమంత్రికి ఇలాంటి లేఖ రాయడం ద్వారా తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
“కాంగ్రెస్ గతంలో మూడుసార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించి, తర్వాత దానిని రద్దు చేసిన సందర్భాలు మన ముందు ఉన్నాయి. ఆ సంస్థను నిషేధించే అధికారం కాంగ్రెస్ కు లేదు,” అని ఆయన అన్నారు. మంత్రి ఏమీ చేయలేరని తెలిసినా కేవలం “జిమ్మిక్” కోసమే ఇలాంటి లేఖ రాశారని విజయేంద్ర అన్నారు.
“బహుశా, ఖర్గే కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఆయన గాంధీ కుటుంబాన్ని కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు” అని శికారిపుర ఎమ్మెల్యే బెంగళూరులో విలేకరులతో అన్నారు.


