పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశకు నామినేషన్ పత్రాల దాఖలు సోమవారం ముగిసింది, ప్రతిపక్ష ఇండియా కూటమి చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఆయా స్థానాల్లో పోటీదారులు ఎవరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల అభ్యర్థులు ఒకరినొకరు పోటీపడుతున్నారు.
ఎన్నికల కమిషన్ ప్రకారం, మొదటి దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, దీనిలో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో నవంబర్ 6న 121 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి, 61 మంది నామినేషన్ల ఉపసంహరణ తర్వాత, 300 నామినేషన్లను పరిశీలన సమయంలో తిరస్కరించారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్-లార్జెస్ట్ పార్టీగా అవతరించిన రాష్ట్రీయ జనతా దళ్, ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తుంది. మొత్తంగా ఆ పార్టీ 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
కహల్గావ్, లాల్గాంజ్, వార్సలిగంజ్, వైశాలీ స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు తలపడుతున్నారు. బచ్వారా, రాజపకడ్రా, బిహార్ షరీఫ్, సమస్థిపుర్లోని రోసెరా స్థానాల్లో సీపీఐ-కాంగ్రెస్ తలపడుతున్నాయి. వీఐపీ పార్టీ అధినేత ముఖేష్ సాహ్ని తన తమ్ముడు సంతోష్ సాహ్నిని దర్భంగా జిల్లా గౌడ బౌరం స్థానంలో బరిలోకి దింపారు. ఆర్జేడీ ఇక్కడి నుంచి బరిలో దూకింది.
తారాపుర్లోనూ ఈ రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. సయోధ్య కుదుర్చుకుని 2024 లోక్సభ ఎన్నికల తరహాలో ఐక్యతను చాటుకుంటాయా? స్నేహపూర్వక పోటీ అనే ముసుగును తొడిగి వదిలేస్తాయా? అనేది వేచిచూడాలి. అధికార ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటులో విజయం సాధించినా ఆరు పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఇబ్బందులు వెంటాడుతుండటంతో సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. తొలివిడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం.
ఇండియా కూటమికి పెద్దదిక్కు ఆర్జేడీ పార్టీ. అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా, నేరుగా వారితో నామినేషన్లు వేయించింది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇది నిదర్శనం. రెండో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లోనూ వీలైనన్ని ఎక్కువచోట్ల అభ్యర్ధులను ఆర్జేడీ బరిలోకి దింపనుంది. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు.
కాగా, కాంగ్రెస్ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కాంగ్రెస్, ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేషన్ దాఖలు సమయంలో నాటకీయత
ససారాం నుండి ఆర్జేడీ అభ్యర్థి సత్యేంద్ర సాహ్ను నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కొద్దిసేపటికే, పొరుగు రాష్ట్రంలో అతనిపై పెండింగ్లో ఉన్న కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల బృందం అరెస్టు చేసింది.
ఇండియా కూటమి అభ్యర్థులతో సంబంధం ఉన్న ఈ రకమైన మూడవ సంఘటన ఇది.
గత వారం ప్రారంభంలో, సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థులు జితేంద్ర పాశ్వాన్, సత్యదేవ్ రామ్లను వరుసగా భోరే, దరౌలి నుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కొద్దిసేపటికే అరెస్టు చేశారు.
ఈ అరెస్టులు ‘రాజకీయ ప్రేరేపితం’ అని,20 సంవత్సరాలుగా బీహార్ను పాలిస్తూ… ఇప్పుడు అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎన్డీఏ శిబిరంలో ‘భయాందోళన’కు సంకేతం అని వామపక్షాలు ఆరోపించాయి.


