హైదరాబాద్: పోలీసులుగా నటిస్తూ, తమ పిల్లలు కిడ్నాప్ అయ్యారని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కోరారు.
“నేరగాళ్లు మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని ప్లే చేస్తే, భయపడవద్దు లేదా మానసికంగా బాధపడకండి. ఆందోళన, భయం.. ఈ రెండూ సైబర్ నేరస్థులకు వరంగా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టడానికి, అప్రమత్తతతో పాటు అవగాహన కూడా అవసరం” అని పోలీస్ కమిషనర్ ‘X’లో పోస్ట్ చేశారు.
“ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు… మీ పిల్లలు లేదా బంధువుల వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోకూడదు. మీకు అలాంటి బెదిరింపు కాల్స్ వస్తే, వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయండి. హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి” అని ఆయన అన్నారు.
ఈమేరకు పోలీస్ అధికారిగా నటిస్తూ, పిల్లల తండ్రిగా నటిస్తున్న మోసగాడి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను కూడా సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో మైనర్లతో అశ్లీల కంటెంట్ను సృష్టించినందుకు రెండు యూట్యూబ్ ఛానెల్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి పోలీస్ కమిషనర్ గతంలో పోస్ట్ చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఈ కేసు నమోదు చేసారు.
“సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కాబట్టి, మీరు ఎలాంటి కంటెంట్ను సృష్టించవచ్చని కాదు. చట్ట ప్రకారం బాధ్యులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది” అని ఆయన అన్నారు.
సైబర్ నేరాలకు వ్యతిరేకంగా తన కఠినమైన వైఖరికి పేరుగాంచిన పోలీస్ కమిషనర్, మైనర్లతో కూడిన అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేయకుండా సోషల్ మీడియా ఛానెల్లు,కంటెంట్ సృష్టికర్తలను హెచ్చరించారు.
ఆన్లైన్ ప్రజాదరణ కోసం పిల్లలను ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆయన ప్రశ్నించారు. “వ్యూస్ పొందే క్రమంలో విలువలు క్షీణించినప్పుడు, మనం ఏమి అవుతున్నాము? సోషల్ మీడియాలో వీక్షణలు మరియు లైక్లను పొందడానికి పిల్లలను పణంగా పెట్టడం ఎంతవరకు సమర్థనీయం? మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ను సృష్టించడం ద్వారా, మీరు నిజంగా సమాజానికి ఏ సందేశాన్ని పంపుతున్నారు?,” అని ఆయన ప్రశ్నించారు.
సమాజ పురోగతికి నిజంగా దోహదపడే వారిని,యువత, పిల్లలను ప్రేరేపించే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి హైలైట్ చేయాలని ఆయన సోషల్ మీడియా ఛానెల్లకు సూచించారు. “పిల్లలతో ఇలాంటి అనుచిత వీడియోలు తయారు చేసి వారి మనసులను మళ్లించవద్దు” అని హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ అన్నారు.


