గాజా: సెంట్రల్ వెస్ట్ బ్యాంక్లోని తుర్ముస్ అయ్య గ్రామంలో ముసుగు ధరించిన యూదు సెటిలర్ ఒక పాలస్తీనా మహిళపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దాడిని అమెరికా జర్నలిస్ట్ జాస్పర్ నథానియల్ వీడియోలో బంధించారు, ఇజ్రాయెల్ వలసదారుడు 55 ఏళ్ల పాలస్తీనా మహిళా రైతును కర్రతో స్పృహ కోల్పోయేలా కొట్టాడని ఆయన అన్నారు.
ఆ మహిళను అఫాఫ్ అబు అలియా, అలియాస్ ఉమ్మె సలేహ్ గా గుర్తించారు, ఆమె తన కుటుంబం కోసం ఆలివ్ పండ్లను కోయడానికి పొలానికి వెళ్ళింది. ఈ వీడియోను అమెరికా జర్నలిస్ట్ సోషల్మీడియాలో షేర్ చేసారు.
పాలస్తీనా మహిళా రైతుపై దాడి చేసిన ఇజ్రాయెలీ యువకుడు ఒక పెద్ద కర్రను పట్టుకొచ్చి అలియాను కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఇజ్రాయెల్ వలసదారుడు ఆలియా తలపై పదే పదే కొట్టాడని, ఆమె స్పృహ కోల్పోయే వరకు ఆమె తలపై కొట్టాడని అమెరికా జర్నలిస్ట్ నథానియల్ చెప్పాడు. ఆమె నేలపై పడిపోయినా అతడు మాత్రం ఆమెను కొట్టడం ఆపలేదు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు, అక్కడ మెదడు రక్తస్రావం కావడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చినట్లు పాలస్తీనా మీడియా నివేదికలు తెలిపాయి.
ఈ దాడిలో పాలస్తీనియన్తో సహా మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. గాయపడిన మరొక వ్యక్తి విదేశీ జాతీయుడు, అతను ఆలివ్ పంట కాలంలో ఇజ్రాయెల్ వలసదారుల నుండి తరచుగా హింసాత్మక దాడికి గురవుతున్న పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్లాడని చెబుతారు.
బిబిసి నివేదిక ప్రకారం… ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఘర్షణ ఆగిందని, సెటిలర్లు చేసే హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
అయితే అమెరికన్ జర్నలిస్ట్ నథానియల్ ఈ వాదనను తిరస్కరించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడికి ఇజ్రాయెల్ దళాలు రాలేదు” అని అన్నాడు. ఇజ్రాయెల్ సైనికులు దాడి జరిగిన ప్రదేశంలో ముందే ఉన్నారని, సెటిలర్ల దాడికి ముందే ఇజ్రాయెల్ దళాలు అక్కడినుండి “వేగంగా పారిపోయాయని” కూడా ఆయన ఆరోపించారు.
BBC నివేదిక ప్రకారం, తుర్ముస్ అయ్యాలో దాదాపు 80 శాతం మంది స్థానికులు నథానియల్ లాగానే US పౌరసత్వం ఉంది. కాగా, ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ అధికారులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఈ వీడియో ఫుటేజ్ పాలస్తీనాలో మానవ హక్కుల పరిస్థితిపై UN ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ దృష్టిని ఆకర్షించింది. వీడియోను షేర్ చేస్తూ… ఇటువంటి దాడులు సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఇజ్రాయెల్ వైపు నుండి ఎటువంటి చర్య లేవని ఆమె హైలైట్ చేసింది.
“2 సంవత్సరాలుగా యావత్ ప్రపంచం వెస్ట్ బ్యాంక్లో ఇలాంటి దృశ్యాలను చూసింది. నాగరిక ఇజ్రాయెలీలు ఎక్కడ ఉన్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది; కేవలం టెల్ అవీవ్లో నిరసన తెలిపే వారు మాత్రమే మంచివారేమో” అని ఆమె Xలో రాసింది.
“హమాస్ పట్ల ద్వేషం వేరే విషయం, కానీ తమ తోటి పౌరులు నేరస్థుల్లా విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఆపడానికి చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారికి లేదా?” అని పోస్ట్లో ఆమె రాసుకొచ్చారు.



