హైదరాబాద్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు హైవేపై బస్సుకు మంటలు అంటుకున్న ఘటనలో కనీసం 20 మంది మరణించినట్లు అనుమానం. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.
హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంనుండి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది. బస్సు సిబ్బందితో పాటు మొత్తం 43 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. హైదరాబాద్ దాటగానే చాలామంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు… మొత్తంగా తెల్లవారుజామున డ్రైవర్ ఒక్కరు తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఈ సమయంలో జరిగిన చిన్న ప్రమాదం ఈ స్థాయిలో ప్రాణనష్టం సృష్టించిందని డిఐజి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
బస్సు కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్-బెంగళూరు హైవేపై వేగంగా వెళుతుండగా ఓ బైక్ అడ్డువచ్చింది… దీంతో దాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే బైక్ ఉన్నవ్యక్తి రోడ్డుపక్కన పడిపోయాడు… కానీ ఆ బైక్ మాత్రం బస్సు కింద చిక్కుకుపోయింది. దీంతో తీవ్ర రాపిడి జరిగి పెట్రొల్ ట్యాంక్ పేలింది…ఫలితంగా బస్సు ముందుభాగంలో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు కొంతమంది స్థానికులు, ప్రయాణీకులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని, అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అధికారులు ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పరిశీలిస్తున్నారు. మృతుల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించే పనిలో ఉన్నారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది, ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది.
కాగా, కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచించారు.


