హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),సింథటిక్ కంటెంట్ వాడకాన్ని నియంత్రించడానికి భారత ఎన్నికల కమిషన్ కొత్త నియమాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో AI, సింథటిక్ కంటెంట్ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, దాని వినియోగాన్ని బహిర్గతం చేయాలని కోరింది. ఈ నిర్ణయం ఎన్నికల సమగ్రతను కాపాడటానికి, నకిలీ డిజిటల్ మెటీరియల్ వ్యాప్తిని నిరోధించడానికి ఉపయోగపడనుంది.
ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రచార బృందాలు ప్రచార సమయంలో తప్పుడు సమాచారాన్ని నివారించడానికి ECI మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి R. V. కర్ణన్ ఆదేశించారు.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రచార సామగ్రిలో ఉపయోగించే ఏదైనా AI-జనరేటెడ్ చిత్రం…అని వీడియో లేదా ఆడియో తప్పనిసరిగా లేబుల్ను ప్రదర్శించాలి.
ప్రచార సామగ్రి తయారీదారులను కూడా గుర్తించాలి. ఒక వ్యక్తి వాయిస్, ముఖం లేదా గుర్తింపును వారి అనుమతి లేకుండా తప్పుగా సూచించే లేదా ఓటర్లను తప్పుదారి పట్టించే లక్ష్యంతో AI-జనరేటెడ్ కంటెంట్ను ఉపయోగించడాన్ని ECI నిషేధించింది.
ఏదైనా తప్పుదారి పట్టించే సింథటిక్ కంటెంట్ నివేదించినా, దానిని మూడు గంటల్లోపు తొలగించాలి. అదనంగా, రాజకీయ పార్టీలు తమ ప్రచారాల సమయంలో ఉపయోగించిన అన్ని AI-జనరేటెడ్ చిత్రాల అంతర్గత రికార్డులను నిర్వహించాలి.
నైతిక,పారదర్శక ప్రచారం ప్రాముఖ్యతను బలోపేతం చేస్తూ… జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో జవాబుదారీతనంగా ఉండటానికి అన్ని రాజకీయ పార్టీలు కమిషన్ ఆదేశాలను పాటించాలని ఎన్నికల అధికారి R. V. కర్ణన్ అన్నారు. రాజకీయాల్లో AI, డిజిటల్ సాధనాల ఉపయోగం “ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరచకూడదు, బలోపేతం చేయాలి” అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఏఐతో సృష్టించిన సమాచారాన్ని, కల్పిత అంశాలను రాజకీయ పార్టీలు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసేటపుడు, ప్రకటనలు ఇచ్చేటపుడు జాగ్రత్త వహించాలని ఈసీ ఇదివరకే సూచించింది. పార్టీ స్టార్ క్యాంపెనర్లు, అభ్యర్థులు ఏఐతో సృష్టించిన, డిజిటల్గా మెరుగుపరిచిన, కల్పితమైన అంశాలు ఉంటే స్పష్టంగా తెలపాలని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది. సమాచారాన్ని తారుమారు చేయడానికి లేదా ఓటర్లను తప్పుదారి పట్టించడానికి AI సాధనాలను ఉపయోగించరాదని భారత ఎన్నికల సంఘం నొక్కి చెప్పింది.


