న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీహార్లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లవుతుంది.
సక్రా (ముజఫర్పూర్), దర్భంగాలో జరగనున్న రెండు ఉమ్మడి ర్యాలీలలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ వేదికను పంచుకుంటారు.
ఈమేరకు బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ… ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీకి ఇదే తొలి పర్యటన అవుతుంది. ఆయన మొదట సక్రాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు, అక్కడ ఆయన సక్రా నియోజకవర్గం నుండి మహాఘట్బంధన్ అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ నేత ఉమేష్ కుమార్ రామ్ తరపున ప్రచారం చేస్తారు. ఆ రోజు తర్వాత రాహుల్ తేజస్వి కలిసి దర్భంగాలో మరో ర్యాలీలో పాల్గొంటారు. అక్కడినుంచే మిథిలాంచల్ ప్రాంతం నుండి పోటీ చేసే కూటమి అభ్యర్థులకు గెలిపించమని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు.
కీలకమైన బీహార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఐక్యతను ప్రదర్శించడానికి ప్రతీకగా ఈ ర్యాలీలు పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తాయని పార్టీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ప్రచారంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఉమ్మడిగా కనిపించడం ఇదే తొలిసారి. బిజెపి,జెడి(యు) నేతృత్వంలోని పాలక ఎన్డిఎకి వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శించడానికి ప్రతిపక్ష కూటమి చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనంగా నిలవనుంది.
ఈ ప్రచారానికి ముందు, రాహుల్ గాంధీ ఆగస్టులో తన ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా బీహార్లో వరుసగా 16 రోజులు ప్రజలతో మమేకమయ్యారని, దాదాపు 1,300 కిలోమీటర్లు ప్రయాణించారని రాథోడ్ గుర్తు చేసుకున్నారు.


