హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇక పోలింగ్ కు కేవలం 12 రోజులు మాత్రమే మిగిలాయి. జిల్లా ఎన్నికల అధికారి,GHMC కమిషనర్ RV కర్ణన్, ఎన్నికల పరిశీలకులతో కలిసి సజావుగా, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా ఏర్పాట్లను నిశితంగా సమీక్షిస్తున్నారు.
పోలింగ్ ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఎన్నికల అధికారులు, సిబ్బందితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 127 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ప్రతి బూత్లో నాలుగు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) అమరుస్తారు. దీనితో మొత్తం 1,628 EVMలు అవసరరమవుతాయి. అదనంగా 509 కంట్రోల్ యూనిట్లు,509 VVPAT యంత్రాలను ఉపయోగించడానికి అందుబాటులో ఉంచారు. అన్ని EVMల తనిఖీ, పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. వీటిని ఓటింగ్కు ఒక రోజు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పోలింగ్ బృందాలకు అందజేయనున్నారు.
ఓటర్ల సౌకర్యం నిమిత్తం అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, మొబైల్ రెస్ట్రూమ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, దాదాపు 720 మంది సిబ్బందితో కూడిన ఎనిమిది కంపెనీల కేంద్ర భద్రతా దళాలు ఇప్పటికే జూబ్లీహిల్స్కు చేరుకున్నాయి. అదనంగా, 1,666 మంది స్థానిక పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల కోసం మోహరించనున్నారు.
ఇప్పటివరకు, 65 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాలను హై అలర్ట్లో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ సరిహద్దుల వెంట విస్తృత తనిఖీ కార్యకలాపాలు జరుగుతున్నాయి.


