న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించింది. నాలుగు కీలక స్థానాలను లెఫ్ట్ కూటమి (ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, డిఎస్ఎఫ్) కైవసం చేసుకోవడం విశేషం. జెఎన్యుఎస్యు ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. ఆ రోజు నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టులతోపాటు, 42 కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్ జరిగింది. అర్హత కలిగిన 9,043 మంది విద్యార్థులలో 67 శాతం ఓట్లు వేశారు. మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగగా, గురువారం సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యాయి.
అధ్యక్షురాలిగా అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలిగా కె. గోపికా బాబు, ప్రధాన కార్యదర్శిగా సునీల్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా డానిష్ అలీ ఎన్నికయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎబివిపి తుడిచిపెట్టుకుపోయింది. అధ్యక్షురాలిగా ఎన్నికైన మిశ్రా 1,861 ఓట్లు సాధించగా, ఆమె ప్రత్యర్థి ABVPకి చెందిన వికాస్ పటేల్ 1,447 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె 449 ఓట్ల తేడాతో గెలిచింది.
ఇకఉపాధ్యక్షురాలిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన కిజాకూట్ గోపిక బాబు (3,101 ఓట్లు వచ్చాయి), ఎబివిపి అభ్యర్థి తాన్య కుమారి (1787)పై 1,314 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన సునీల్ యాదవ్ (2005), ఎబివిపి అభ్యర్థి రాజేశ్వర్ కాంత్ దూబే (1,901)పై 104 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన డానిష్ అలీ (2,083), ఎబివిపి అభ్యర్థి అనుజ్ డమరా (1,797)పై 286 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వామపక్ష కూటమి మూడు ఐసి స్థానాలను, చాలా కౌన్సిలర్ పదవులను గెలుచుకుంది.
ఏప్రిల్లో జరిగిన మునుపటి విద్యార్థి సంఘం ఎన్నికల మాదిరిగా కాకుండా, వామపక్ష సమూహాల మధ్య చీలిక ఏర్పడింది, ఈ సంవత్సరం ‘వామపక్ష ఐక్యత’ కూటమిలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ ఉన్నాయి.
ఏప్రిల్ ఎన్నికలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సంయుక్త కార్యదర్శి పదవిని కూడా కోల్పోయింది. అయినప్పటికీ దాని అభ్యర్థులు కొందరు వామపక్షాల చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్కు చెందిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది.
జెఎన్యుఎస్యు ఎన్నికలలో సంఘ్ పరివార్ మతతత్వ, విభజన రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించినందుకు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ శుభాకాంక్షలు తెలిపింది.
కాగా, విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు PTIతో మాట్లాడుతూ… క్యాంపస్లో “అతిపెద్ద సమస్య” “నిధుల కోత” అని అన్నారు. బిజెపి జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చినప్పటి నుండి … అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం నిధులు తగ్గుతున్నాయి. కాబట్టి, మా మొదటి పోరాటం క్యాంపస్ కోసం ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడం” అని అన్నారు.


