హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్ సిగలో మరో మరో మణిహారం చేరనుంది. చారిత్రాత్మక మీర్ఆలం చెరువుపై మరో ఐకానిక్ వంతెనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్ను కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్కు రూ. 319.24 కోట్లకు అప్పగించింది. ప్రభుత్వ అసలు అంచనా రూ. 304.36 కోట్ల కంటే ఇది 4.89 శాతం ఎక్కువ.
మూసీ నది ఒడ్డున నిర్మించనున్న ఈ 2.5 కి.మీ. వంతెన, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాక, నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LOA) జారీ చేయడానికి, ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముసి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కు అధికారం ఉంది. ఈ వంతెనను మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వంతెననాలుగు వరుసల రోడ్డుతో పాటు, కేబుల్-స్టేడ్ డిజైన్ను ప్రతిపాదించారు. అంతేకాదు బ్రిడ్జి చివరన నడిచేవారి కోసం విశాలమైన కాలిబాటను ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమాన ఉన్న చింతల్మెట్ ప్రాంతాన్ని, తూర్పున శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు.


