టెల్అవీవ్: కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో యావత్ ప్రపంచం కొత్త ఏడాదిని స్వాగతిస్తుంది. కానీ గాజాలో మాత్రం ఈఏడాది భయానక అనుభవాలను మిగిల్చింది. ఇజ్రాయెల్ బాంబుదాడులు ఏకంగా వేలమందిని హతమార్చింది. లక్షల మందిని గాయపర్చింది. మరికొన్ని లక్షలమందిని నిరాయశ్రయులను చేసింది. ఈ సంవత్సరం గాజా ఓ శిధిల నగరంగా మారింది. మొత్తంగా 2025 పాలస్తీనియన్లకు “అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విధ్వంసకర” ఏడాదిగా మార్చాయని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
బిమ్కోమ్, గిషా, అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇజ్రాయెల్, పబ్లిక్ కమిటీ ఎగైనెస్ట్ టార్చర్ ఇన్ ఇజ్రాయెల్, హమోకెడ్, యెష్ దిన్, కంబాటెంట్స్ ఫర్ పీస్, ఇర్ అమీమ్, ఎమెక్ షావే, ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇజ్రాయెల్, బ్రేకింగ్ ది సైలెన్స్, టోరట్ ట్జెడెక్ అనే 12 ఇజ్రాయెల్ మానవ హక్కుల సంఘాలు విడుదల చేసిన సంయుక్త ఈ విషయాన్ని పేర్కొన్నాయి.
“2023, 2024లో ఇజ్రాయెల్ మారణహోమం సమయంలో గాజాలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. కానీ 2025లో ఫలితాలు భారీగా పెరగడం గమనార్హం. మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. గాజా ఎన్క్లేవ్లో నిర్వాసితులు భారీగా పెరిగారు. ఆకలి సామూహిక మరణానికి కారణమైంది” అని నివేదిక పేర్కొంది.
“యుద్ధం ప్రారంభంలో అసాధారణమైనవిగా పరిగణించిన ఉల్లంఘనలు ప్రస్తుత సంవత్సరంలో రోజువారీ ఆచరణలో భాగమయ్యాయి” అని హక్కుల సంఘాలు తెలిపాయి. ఇక ఈఏడాది “గాజా యుద్ధం 1967 తర్వాత పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతకమైనది,అత్యంత వినాశకరమైనది మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.”
ఇజ్రాయెల్ హక్కుల సంఘాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం… ఇజ్రాయెల్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య మార్చి 2024లో 36,000కు చేరుకుంది. అక్టోబర్ 2025 నాటికి ఆ సంఖ్య 67,173కి పెరిగింది. వీరిలో 20,000 మందికి పైగా పిల్లలు, దాదాపు 10,000 మంది మహిళలు ఉన్నారు. అంతేకాకుండా శిథిలాల కింద ఇంకా పదివేల మృతదేహాలు ఉన్నట్లు అంచనా. గాయపడిన వారి సంఖ్య లక్షా 70వేలు దాటింది.
ఆ నివేదిక ప్రకారం… 2025లో నిర్వాసితులైన పాలస్తీనియన్ల సంఖ్య 1.9 మిలియన్ల మందికి చేరుకుంది. ఇది గాజా జనాభాలో దాదాపు 90 శాతం. ఇది 2024లో ఈ సంఖ్య ఒక మిలియన్గా ఉంది. ఇక నిర్వాసితులకు ఏర్పాటు చేసిన తాత్కాలిక గృహాలు బాంబుదాడుల దెబ్బకు కూలిపోయాయి. నీరు, విద్యుత్ సహా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది.
ఇక ఇజ్రాయెల్ ప్రేరేపిత ఆకలి గురించి… నివేదిక చేదు నిజాలను వెల్లడించింది. అక్టోబర్ 2025 నాటికి 157 మంది పిల్లలు సహా 461 మంది కేవలం ఆకలితో మరణించారు. 2025లో ఇజ్రాయెల్ యంత్రాంగం సృష్టించిన “రోజువారీ విషాదం”లో సహాయం కోసం వేచి ఉండగా 2,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 16,929 మంది గాయపడ్డారని హక్కుల సంఘాలు తెలిపాయి.
సెటిలర్స్ హింస
హక్కుల సంఘాల ప్రకారం… ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో 2023-2024 మధ్య ఇజ్రాయెలీ సెటిలర్ల దాడులు దాదాపు 1,200 నమోదయ్యాయి. అయితే 2025లో ఈ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది.
అంతేకాదు 44 పాలస్తీనియన్ పశువుల కాపరుల సంఘాలు పూర్తిగా నిర్వాసితులయ్యారని, 10 సంఘాలు పాక్షికంగా ఖాళీ చేసారని నివేదిక కనుగొంది. మొత్తం స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 2,932కి చేరుకుంది, ఇందులో 1,326 మంది పిల్లలు ఉన్నారు.
2023లో ఎలాంటి అభియోగాలు లేకుండా నిర్బంధించిన ఖైదీల సంఖ్య 1,000 నుండి 2025లో 3,577కి పెరిగిందని, ఇది యుద్ధానికి ముందు సగటు కంటే మూడు రెట్లు పెరిగిందని అది జోడించింది. ఇక హింస, వైద్య చికిత్స నిరాకరణ, అమానవీయ నిర్బంధ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్ కస్టడీలో కనీసం 98 మంది పాలస్తీనియన్ మరణాలను నివేదిక నమోదు చేసింది.
అంతేకాదు “2025 గతంలో ఊహించలేని వాస్తవాన్ని వెల్లడించింది: ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని క్రమపద్ధతిలో ఉల్లంఘించింది. పాలస్తీనియన్, ఇజ్రాయెల్ హక్కుల సంస్థలు ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనియన్ ఖైదీలను హింసిస్తున్నట్లు పదేపదే నివేదించాయి, వాటిలో కొట్టడం, ఆకలితో అలమటించడం,లైంగిక వేధింపులు ఉన్నాయి.
ఇక 2023 అక్టోబర్ నుండి ఇజ్రాయెల్ దళాలు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో తమ దాడులను తీవ్రతరం చేశాయి. అప్పటి నుండి 1,085 మందికి పైగా పాలస్తీనియన్లు చంపేశారు. 10,700 మంది ఇతరులు ఆక్రమిత భూభాగంలో సైన్యం, ఇజ్రాయెల్ సెటిలర్ల దాడుల్లో గాయపడ్డారు. 20,500 మందికి పైగా ప్రజలను అరెస్టు చేశారు.
గత జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. వెస్ట్ బ్యాంక్ మరియు తూర్పు జెరూసలేంలోని అన్ని స్థావరాలను ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది.


