హైదరాబాద్: వివాదాస్పద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా, హిల్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ నంబర్ 27ను సవాలు చేస్తూ, హైదరాబాద్ ట్రావెల్ గైడ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశారు. జిఓ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య, మిశ్రమ వినియోగ మండలాలుగా మార్చడానికి అనుమతించింది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఎ పాల్ కూడా ఈ అంశంపై పిల్ దాఖలు చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి జీడిమెట్ల, పటాన్చెరు, పాశమైలారం వంటి భారీగా కలుషితమైన పారిశ్రామిక ఎస్టేట్లలో పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస అపార్ట్మెంట్లను అనుమతిస్తారు. భూగర్భ జలాలు, గాలి, నేల కాలుష్యం ఇప్పటికే దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలా అనుమతివ్వడం ప్రజారోగ్య విపత్తును సృష్టిస్తుందని పర్యావరణవేత్త కూడా అయిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.
దాదాపు 9,300 ఎకరాల మార్పిడికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అనుమతి ఇస్తున్నారని ఆయన వాదించారు. అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వు 2013లో జారీ చేసిన ఉత్తర్వుకు విరుద్ధంగా ఉంది, ఇది కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ దాటి తరలించాలని ఆదేశించింది, అంతేకాకుండా HMDA జోనింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులో కూడా భూముల మార్పిడికి ప్రమాణాలు లేవని, SRO విలువలో 30 శాతం నుండి 50 శాతం వరకు చాలా తక్కువ మార్పిడి రుసుమును విధించారని ఆయన ఎత్తి చూపారు.
అన్ని పరిశ్రమలు తరలించే వరకు ఎటువంటి మార్పిడి జరగదని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. యూనిట్ల తరలింపు ఈ విధానం ప్రాథమిక ఉద్దేశ్యమని ఆయన అన్నారు. అలాగే “భూ వినియోగంలో ఏదైనా మార్పు HMDA మాస్టర్ ప్లాన్ సవరణ విధానాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది, నోటిఫికేషన్లు జారీ చేయడం, ప్రజల అభ్యంతరాలను కోరడం వంటివి” జరుగుతాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండు పార్టీల వాదనలు విన్న తర్వాత, అడ్వకేట్ జనరల్ ప్రకటనపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ డిసెంబర్ 29కి వాయిదా వేసారు.
ఏమిటీ హిల్ట్ పాలసీ?
హైదరాబాద్ చుట్టూ లేదా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను.. వాణిజ్యం, ఇళు, స్కూళ్లు, ఆసుపత్రులు, మాల్స్ కోసం వాడుకునేలా ప్రభుత్వం ఈ పాలసీని తెచ్చింది. తద్వారా కూకట్పల్లి, బాలానగర్, నాచారం వంటి పాత పారిశ్రామిక పార్కులను తిరిగి ఉపయోగపడేలా మార్చుతామని ప్రభుత్వం అంటోంది. అప్పుడు కాలుష్యం తగ్గుతుందనీ, హైదరాబాద్ మరింత మోడ్రన్ సిటీగా మారుతుందని సర్కారు చెబుతోంది. పారిశ్రామిక భూములు కావాలనుకునేవారు డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మార్కెట్ విలువలో 30-50% మాత్రమే ఉంటుంది. అంటే తక్కువ ధరకే భూములు లభిస్తాయి.


