టెల్అవీవ్: రెండు సంవత్సరాల క్రితం గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య బాగా పెరిగిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
అక్టోబర్ 7, 2023 సాయంత్రం నాటికి మంత్రిత్వ శాఖ దాదాపు 62,000 మానసిక కేసులకు చికిత్స అందించిందని, ఈ సంఖ్య దాదాపు 85,000కి పెరిగిందని మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం డిప్యూటీ హెడ్ తమర్ షిమోని అన్నారు. ఆమె ఆర్మీ రేడియోతో మాట్లాడుతూ…ఈ పెరుగుదలను ఊహించలేదని ఆమె అభివర్ణించారు.
అక్టోబర్ 7 నాటి సంఘటనలకు సంబంధించిన మానసిక సమస్యలను ఇజ్రాయెల్ సైనికులలో మూడింట ఒక వంతు మంది ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు.
ఇప్పుడు ఒకే డాక్టర్ 750 మంది రోగులకు చికిత్స చేస్తున్నాడని, కొన్ని ప్రాంతాలలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల చికిత్స అవసరమైన ప్రతి ఒక్కరికి డాక్టర్ను చేరుకోవడం కష్టమవుతుందని షామోని చెప్పారు.
నవంబర్లో, యెడియోత్ అహ్రోనోత్ వార్తాపత్రిక ఇజ్రాయెల్లో “విస్తృతమైన మానసిక సంక్షోభం” గురించి హెచ్చరించింది. మాదకద్రవ్య వ్యసనం పెరుగుతుందని, పెద్ద సంఖ్యలో సైనికులతో సహా దాదాపు రెండు మిలియన్ల మంది మానసిక ఆరోగ్య మద్దతు అవసరం అని పేర్కొంది.
ఆత్మహత్య సంఘటనలు
సైన్యంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ మీడియా కూడా నివేదించింది. యుద్ధం తర్వాత బాధాకరమైన ఒత్తిడికి గురైన ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని మారివ్ వార్తాపత్రిక తాజాగా తెలిపింది. గివాటి బ్రిగేడ్కు చెందిన ఒక రిజర్వ్ అధికారి కూడా గత వారం మానసిక పోరాటం తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది.
అక్టోబర్లో ప్రచురించిన ఇజ్రాయెల్ సైనిక డేటా ప్రకారం…సైన్యం 18 నెలల్లో 279 ఆత్మహత్యాయత్నాలను నమోదు చేసింది, వాటిలో 36 మరణాలు ఉన్నాయి.
కాగా, 2023 అక్టోబర్ నుండి గాజాలో 70,000 మందికి పైగా ప్రజలను ఇజ్రాయెల్ చంపింది. వీరిలో ఎక్కువగా మహిళలు పిల్లలే కావడం గమనార్హం. అంతేకాదు 171,000 మందికి పైగా గాయపడ్డారు.


