ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ప్రజలు రోడ్లపై స్వేచ్చగా తిరగడం లేదు. రాజధాని ఇంఫాల్ పొరుగున ఉన్న నాగాలాండ్లోని దిమాపూర్తో కలిపే జాతీయ రహదారి-2 ద్వారా రాకపోకలు సజావుగా సాగడంలేదని వచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఓ నివేదికను ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అధికారులను ఆదేశించింది.
ప్రారంభంలో, ఆగస్టు 20న NHRC ఇంఫాల్ జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్, పోలీసు చీఫ్కు పిటిషన్ ద్వారా లేవనెత్తిన అంశాన్ని పరిశీలించి, నివేదికను పంపాలని చెప్పింది. ఇంఫాల్ వెస్ట్ జిల్లా పోలీసు చీఫ్ సెప్టెంబర్ 9న NHRCకి సమాధానమిస్తూ… ఈ విషయం తమ అధికార పరిధిలో లేదని, తమ కాంగ్పోక్పి సహచరుల పరిధిలో ఉందని అన్నారు. ఆ తర్వాత NHRC కాంగ్పోక్పి పోలీసు చీఫ్, జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్లను నివేదిక పంపమని ఆదేశించింది.
“.. కాబట్టి ఈ విషయంలో కమిషన్ నిర్దేశించిన అదనపు/పూర్తి నివేదికను జనవరి 4, 2026 నాటికి కమిషన్ తదుపరి పరిశీలన కోసం పంపాలని అభ్యర్థించారని” NHRC పిటిషన్కు ప్రతిస్పందనగా తెలిపింది.
‘హక్కుల నిరాకరణ’
కాంగ్పోక్పి జిల్లా ప్రాంతంలోని “జాతీయ రహదారి-2 (ఎల్ఎంఫాల్-దిమాపూర్ రోడ్డు)పై నిరంతర అడ్డంకులపై ఇంఫాల్ వాసి అసెం రోషన్ సింగ్ జూన్లో NHRCకి పిటిషన్ దాఖలు చేశారు.
“భయం, దోపిడీ, అపహరణ, జాతి లక్ష్యంగా అమలవుతున్న ఈ దిగ్బంధనం, రాష్ట్రవ్యాప్తంగా పౌరులు, ముఖ్యంగా పేదలు, విద్యార్థులు, రోగుల మానవ హక్కులు, జీవనోపాధిపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది” అని రోషన్ సింగ్ పిటిషన్లో పేర్కొన్నారు.
NH-2 కాంగ్పోక్పి విభాగం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రజా రహదారిలో ఒక భాగం. కానీ ఇది చాలా మంది పౌరులకు అందుబాటులో లేకుండా పోయింది, “ముఖ్యంగా మెయిటీ పౌరులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. రాజ్యాంగ అధికారుల నుండి పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ, NH-2కి ప్రవేశించడాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. దీంతో తక్షణ పరిష్కారాన్ని చూపాలని రోషన్ సింగ్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కీలకమైన మార్గంలో ప్రవేశాన్ని తిరస్కరించడం వల్ల ఆర్థికంగా బలహీన వర్గాలు, రోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు తీవ్రంగా బాధ పడుతున్నారు. వారికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన స్వేచ్ఛ, గౌరవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. అంతేకాదు “నిరంతర దిగ్బంధనం… చట్టవిరుద్ధమైన ప్రాంతాన్ని సృష్టించింది. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసిందని పిటిషన్ పేర్కొంది.
కాగా, రహదారులపై స్వేచ్ఛంగా తిరిగేందుకు నిరాకరిస్తున్నందున “ఓపెన్-అండ్-షట్-కేసు”కి వ్యతిరేకంగా మైటీ సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.
మరోవంక అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో నిన్నటినుంచి రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. ఆమె రాక సందర్భంగా ఏడు మిలిటెంట్ గ్రూపులు బంద్పాటిస్తున్నాయి. దీంతో మార్కెట్లు మూసివేసారు. రోడ్లపై రాకపోకలు లేకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చాయి.


