హైదరాబాద్: చలి తీవ్రత హైదరాబాద్ను కమ్మేసింది. చలి దెబ్బకు జనాలు అస్సలు బయటకు రావడం లేదు. ఈ ఉదయం నగరం ఏడు సంవత్సరాలలో అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసింది.
తెలంగాణ వెదర్మ్యాన్ బాలాజీ ప్రకారం… హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రాంతంలో 6.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలీ 7.3 డిగ్రీల సెల్సియస్తో రెండవ అత్యల్ప ఉష్ణోగ్రత, రాజేంద్ర నగర్లో 7.7 డిగ్రీల సెల్సియస్తో నమోదైంది. హైదరాబాద్లోని శివరాంపల్లి, అల్వాల్,, గచ్చిబౌలి, బొల్లారం, మారేడ్పల్లి, కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ ప్రకారం… ఉదయం సమయంలో నగరంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ 13, 14 తేదీల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 12 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది.
కాగా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 5 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రానున్న రోజుల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గుతాయని వెల్లడించింది. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది అంటున్నారు.


