వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ దాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వైట్ హౌస్ నొక్కి చెప్పింది. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు “కఠినమైన” ప్రైవేట్ సందేశాలను పంపింది.
వారాంతంలో గాజా నగరంలో జరిగిన దాడిలో హమాస్ సైనిక విభాగం డిప్యూటీ కమాండర్ రయీద్ సాద్ను ఇజ్రాయెల్ చంపిన తర్వాత ఈ సందేశం వచ్చిందని మీడియాతో మాట్లాడిన వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో మొత్తం నలుగురు మరణించారు.
నివేదిక ప్రకారం…నెతన్యాహుకు వైట్ హౌస్ పంపిన సందేశం ఇలా ఉంది…మీరు మీ ప్రతిష్టను నాశనం చేసుకోవాలని అనుకుంటుంటే.. ఒప్పందాలను పాటించడం లేదని చూపించాలనుకుంటే, అది మీ ఇష్టం. కానీ గాజాలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీయడానికి మేము మిమ్మల్ని అనుమతించము అని రాసారని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారు.” నివేదిక ప్రకారం, దాడికి ముందు ఇజ్రాయెల్ ప్రభుత్వం వాషింగ్టన్కు తెలియజేయలేదని అమెరికా అధికారులు తెలిపారు.
కాగా, గాజాలోని హమాస్ చీఫ్ ఖలీల్ అల్-హయ్యా ఓ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ… ఇజ్రాయెల్ దాడిలో సాద్ మరణించాడని ధృవీకరించారు. శనివారం వైమానిక దాడిలో సాద్ మరణించే వరకు అనేక ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు గురి అయ్యాడు.
అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ ఈ దాడి జరిగింది. ఒప్పందం కుదిరినప్పటినుండి ఇజ్రాయెల్ సైన్యం పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘించింది, కనీసం 391 మంది పాలస్తీనియన్లను చంపింది. 1,063 మందిని గాయపరచింది.
అక్టోబర్ 2023 నుండి గాజాలో జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ 70,600 మందికి పైగా ప్రజలను చంపింది, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. అంతేకాదు మరో 171,100 మందికి పైగా గాయపడ్డారు, ఈ దాడులు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ కొనసాడమే నేటి విషాదం.
https://pbs.twimg.com/media/G8LwINgWwAYjbmY?format=jpg&name=360×360


