న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి కేంద్రం తలుపులు తెరిచింది. ఈమేరకు లోక్సభలో శాంతి బిల్లును ప్రవేశపెట్టారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లు-2025ను తీసుకొచ్చారు.
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినట్లయితే… ఈ బిల్లు అణుశక్తి చట్టం-1962ను రద్దు చేస్తుంది. ఈ కొత్త బిల్లు, ప్రైవేట్ కంపెనీలను 49% వరకు విదేశీ పెట్టుబడులతో సహా, అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి, నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఈ కీలకమైన సంస్కరణ, 2047 నాటికి 100 GW అణు విద్యుత్ సామర్థ్యం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా ప్రైవేట్, విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు దోహదపడుతుంది.
“కాగా, ఈ బిల్లు… అణుశక్తి నియంత్రణ బోర్డుకు చట్టబద్ధమైన హోదాను అందించడానికి ప్రయత్నిస్తుంది” అని PMOలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.
శాంతి బిల్లు కింద ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే… భారతీయ ప్రైవేట్ కంపెనీలు అణు విద్యుత్ ప్లాంట్లు, రియాక్టర్లను నిర్మించడానికి, స్వంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి, లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి – ఈ కార్యకలాపాలు ఇప్పటివరకు ప్రధానంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL), ఇతర ప్రభుత్వ సంస్థలతో జాయింట్ వెంచర్లకు పరిమితం చేసారు.
ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది. అంతేకాదు అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.
టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన భారతీయ కంపెనీలు ఇప్పటికే అణుశక్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. అలాగే వెస్టింగ్హౌస్, GE-హిటాచి, ఫ్రాన్స్కు చెందిన EDF, రష్యాకు చెందిన రోసాటమ్తో సహా ప్రపంచ సరఫరాదారులు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం కోసం సుముఖత వ్యక్తం చేశాయి.
అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన అణు సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడినప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది.
కాగా, అణు విద్యుత్ ఉత్పత్తిలోకి ప్రైవేటు, విదేశీ కంపెనీల ప్రవేశాన్ని అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. అణు ఇంధనం వంటి వ్యూహాత్మకమైన, కీలకమైన రంగంలో ప్రైవేటు కంపెనీలకు ద్వారాలు తెరవడం వినాశకరమైన చర్యని అణు ఇంధన కంపెనీలకు వారు ఉత్పత్తి చేసిన విద్యుత్పై టారిఫ్లను నిర్ణయించడంలో ఈ సవరణలు స్వేచ్ఛను ఇస్తాయని పేర్కొంది.
ఏదైనా అణు ప్రమాదం జరిగినపుడు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నీరు కారుస్తుందని సిపిఎం విమర్శించింది. అమెరికా ఒత్తిళ్ళకు తలగ్గిన ప్రభుత్వం, ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు ఉత్పత్తిదారునికి బాధ్యత లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని సవరిస్తోందని తెలిపింది.


