Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఢిల్లీలో పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ‘నో’!

Share It:

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠినమైన కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి బీఎస్-VI ఇంజన్లు లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. అలాగే కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాలకు బంకుల్లో పెట్రోల్ పోయరు.

కాగా, ఢిల్లీలోకి పాత కార్లకు ప్రవేశం లేదన్న నిర్ణయం… సమీపంలోని గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుండి ఢిల్లీలోకి ప్రవేశించే 12 లక్షల వాహనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నోయిడా నుండి నాలుగు లక్షలకు పైగా, గురుగ్రామ్ నుండి రెండు లక్షలు, ఘజియాబాద్ నుండి 5.5 లక్షల వాహనాలను జాతీయ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధం పడుతుంది.

వాహనాల తనిఖీల కోసం 580 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. 126 చెక్‌పాయింట్ల వద్ద 37 ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యాన్‌లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ పంపుల వద్ద రవాణా శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఆహార శాఖ సిబ్బందిని మోహరించారు.

ఢిల్లీ ఇప్పటికే పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది, ఇవి చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్లు లేని వాహనాలను గుర్తిస్తాయి. ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా నిన్న ఈ ప్రకటన చేశారు. జాతీయ రాజధానిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ అమల్లో ఉన్నంత వరకు ఈ చర్యలు కొనసాగుతాయి.

తీవ్రమైన కాలుష్య పరిస్థితుల్లో (AQI 349 దాటినప్పుడు) ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు, దీనివల్ల BS-3 మరియు అంతకంటే తక్కువ ప్రమాణాల వాహనాలను పరిమితం చేస్తారు. ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి స్క్రాప్ చేస్తారు.

శీతాకాలంలో పీఎం 10 కాలుష్యంలో 19.7 శాతం, పీఎం 2.5 కాలుష్యంలో 25.1 శాతానికి వాహనాలే కారణమని అధ్యయనాలు పేర్కొన్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఈ కఠినమైన చర్యలను అమలు చేసింది. అంతేకాదు గుర్తించిన 100 హాట్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి, ట్రాఫిక్ లైట్ల వద్ద సమయం, కాలుష్యాన్ని తగ్గించే సమీకృత ట్రాఫిక్ వ్యవస్థను నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి.

ఇక ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు. అయితే సెకండరీ, హైయర్‌ సెకండరీ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్, ప్రత్యక్ష తరగతులలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. కార్యాలయాలు కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.