జెరూసలేం: ఇజ్రాయెల్ మారణహోమం కారణంగా శిధిలమైన గాజాలో పనిచేస్తున్న పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. కొత్త రిజిస్ట్రేషన్ నియమాలను పాటించడంలో విఫలమైనందుకు ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, ఆక్స్ఫామ్, కారిటాస్ వంటి ప్రధాన స్వచ్ఛంద సంస్థల విభాగాలు ఈ కారణంగా ప్రభావితమయ్యాయి.
హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు సహాయ సంస్థలలోకి చొరబడకుండా నిరోధించడమే ఈ నియమాల లక్ష్యం అని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ ఈ నియమాలు ఏకపక్షంగా ఉన్నాయని, కొత్త ఆంక్షలు మానవతా సహాయం అవసరమైన సాధారణ ప్రజలకు హాని కలిగిస్తాయని ఆ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కాగా, తమ సిబ్బంది గురించి ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ ఖండించింది.
UK, ఫ్రాన్స్, కెనడా,జపాన్తో సహా అనేక దేశాల విదేశాంగ మంత్రులు మానవతా సంస్థల కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల గాజా జనాభాకు కీలకమైన సహాయం, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సేవలు తీవ్రంగా తగ్గిపోతాయని ఆ సంస్థలు సంయుక్తంగా హెచ్చరిక జారీ చేశారు.
ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం గాజాలో “మానవతా విపత్తును మరింతగా పెంచే” ప్రయత్నంలో భాగమని పాలస్తీనా NGOల నెట్వర్క్ ప్రతినిధి అమ్జాద్ షావా అన్నారు. పాలస్తీనియన్లను వెళ్లగొట్టడం, గాజాను బహిష్కరించడం అనే వారి ప్రాజెక్టును కొనసాగించడానికే “గాజాలో మానవతా కార్యకలాపాలపై ఇజ్రాయెల్ పరిమితులు విధించిందని… షావా అల్ జజీరాతో అన్నారు.
గాజాలో స్వచ్ఛందంగా పనిచేసి, ఇజ్రాయెల్ అధికారులు తిరిగి ప్రవేశించడానికి నిరాకరించిన బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ జేమ్స్ స్మిత్, సహాయ బృందాలపై ఆంక్షలను ఖండించారు. “ఇప్పటికే భయంకరంగా ఉన్న పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. మార్పులు క్రూరంగా ఉంటాయి” అని స్మిత్ అల్ జజీరాతో అన్నారు.
ఇజ్రాయెల్ ప్రకటించిన కొత్త నియమాలు
ఈ సంవత్సరం ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రకటించిన కొత్త నియమాల ప్రకారం…గాజాలో పనిచేయడం కొనసాగించడానికి సహాయ సంస్థలు తమ కార్మికుల పేర్లను నమోదు చేసుకోవాలి. నిధులు, కార్యకలాపాల గురించి వివరాలను అందించాలి.
కొత్త నిబంధనలలో సైద్ధాంతిక అవసరాలు ఉన్నాయి – ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా బహిష్కరణలకు పిలుపునిచ్చిన, అక్టోబర్ 7 దాడిని తిరస్కరించిన లేదా ఇజ్రాయెల్ సైనికులు లేదా నాయకులపై అంతర్జాతీయ కోర్టు కేసులకు మద్దతు ప్రకటించిన సంస్థలను అనర్హులుగా చేయడం వంటివి ఉన్నాయి.
గాజాలో పనిచేస్తున్న సంస్థల్లో దాదాపు 15 శాతం – 30 కి పైగా గ్రూపులు నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయని, వాటి కార్యకలాపాలను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ గ్రూపులలో ఒకటైన డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, దాని సిబ్బందిలో కొందరు హమాస్తో సంబంధం కలిగి ఉన్నారనే ఇజ్రాయెల్ వాదనలకు ప్రతిస్పందించడంలో విఫలమైందని కూడా పేర్కొంది.


