ఇంఫాల్: రెండేళ్లుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో బాంబులు కలకలం సృష్టించాయి. ఈమేరకు ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు 27 బాంబులను స్వాధీనం చేసుకుని, వాటిని నిర్వీర్యం చేశాయని పోలీసులు తెలిపారు.
మణిపూర్లో రెండేళ్ల క్రితం జాతుల మధ్య చెలరేగిన హింస తర్వాత, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు భద్రతా దళాలు “ఆపరేషన్ ఆల్-అవుట్” పేరుతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్లలో భాగంగానే, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాచి ఉంచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ తాజా ఘటనతో, రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. భద్రతా దళాలు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, శాంతిభద్రతలపై ఉక్కుపాదం మోపుతున్నాయి.
మే 2023 నుండి మైటీలు కుకీ-జో వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 260 మందికి పైగా మరణించారు,వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత కేంద్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది. 2027 వరకు పదవీకాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా నిలిపివేశారు.


