న్యూఢిల్లీ: ఐదేళ్లనాటి ఢిల్లీ అల్లర కేసులో అరెస్టయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వారిపై ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంది. అయితే ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం బెయిలిచ్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం నేడు కీలక తీర్పును వెలువరించింది.
కాగా, డిసెంబర్ 10న ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ S V రాజు, నిందితుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూత్రా వాదనలు విన్న తర్వాత, నిందితుల వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
ఖలీద్, ఇమామ్ బెయిల్ దరఖాస్తులను తిరస్కరిస్తూ…నేరపూరిత కుట్రలో ఇద్దరి ప్రమేయాన్ని సూచిస్తూ ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందిందని పేర్కొంది. అంతేకాదు బెయిల్ పరిశీలన సమయంలో నిందితులందరినీ ఒకే స్థాయిలో చూడటం సాధ్యం కాదు. కేసులో ఒక్కొక్కరి ప్రమేయం ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఎవరికి బెయిల్ ఇవ్వాలనేది కేసులోని వారి వ్యక్తిగత పరిస్థితిపై ఆధారంగానే నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది.
మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలీద్, ఇమామ్ల విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని.. అల్లర్లలో వీళ్లిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్లిద్దరూ ఏడాది తర్వాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
కేసు నేపథ్యం
కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాప్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బిజెపి నేత కపిల్ మిశ్రా రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఉత్తర ఢిల్లీలో మూడు రోజులపాటు అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు.
కాగా, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ విడుదల కోసం ఇప్పుడు అంతర్జాతీయంగానూ గళం వినిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఉమర్ ఖలీద్కు లేఖ రాస్తూ మద్దతు ప్రకటించారు.


