హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) జనవరి 9 నుండి 13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని ఎదుర్కొనేందుక, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడపడానికి ప్రణాళిక వేసింది. సాధారణంగా తిరుగు ప్రయాణ రద్దీ పెరిగే జనవరి 18,19 తేదీలలో కూడా ఈ సేవలను పొడిగించనున్నారు.
ఈ బస్సులు హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టాప్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (కేపీహెచ్బీ), బోయిన్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రధాన కేంద్రాల నుండి నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ పందిళ్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు మరియు ఇతర ప్రాథమిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనుంది.
టిక్కెట్ ధరలు 1.5 రెట్లు వరకు సవరణ
ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చిన 2003 సంవత్సరం నుండి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక డ్రైవ్లను అమలు చేస్తోందని, సంక్రాంతి 2026 కోసం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా టిక్కెట్ ఛార్జీలను మరోసారి 1.5 రెట్లు వరకు సవరించినట్లు సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో,ఇతర రాష్ట్రాలకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ ఛార్జీల సవరణ వర్తిస్తుందని, మిగిలిన బస్సులకు సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని యాజమాన్యం పేర్కొంది.
సవరించిన ఛార్జీలు జనవరి 9 నుండి 13 వరకు, అలాగే తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జనవరి 18, 19 తేదీలలో మాత్రమే అమలులో ఉంటాయి.


