డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మౌనంగా ఉన్నారు. మరోవంక భారీ సంఖ్యలో ప్రజలు సీబీఐ విచారణ కోరుతూ వీధుల్లోకి వచ్చారు. దీనిపై నిరసనకారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రం ఆయన గళం విప్పారు.
అంకిత కుటుంబం డిమాండ్లపై చట్టపరమైన ఆధారాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని చెబుతూనే, నిరసనకారులు “రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని” ఉత్తరాఖండ్ సీఎం ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్న కొందరిపై చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. నిరసనల్లో కొడవలి పట్టుకుని పాల్గొన్న హల్ద్వానీకి చెందిన వీడియో బ్లాగర్ జ్యోతి అధికారికి పరిపాలన యంత్రాంగం నోటీసు జారీ చేసింది.
ప్రస్తుత ప్రతిష్టంభన తీవ్రతను అర్థం చేసుకోవడానికి, 2022 నాటి సంఘటనలను గుర్తు చేసుకోవాలి. ఆ సంవత్సరం 19 ఏళ్ల అంకిత భండారి హత్య పౌరీ గర్వాల్లోని ఆమె స్వగ్రామం దోభ్-శ్రీకోట్ దాటి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. రిషికేశ్ సమీపంలోని వనంతర రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న ఆ యువతి సెప్టెంబర్ 18, 2022న అదృశ్యమైంది, ఆ తర్వాత చిల్లా కాలువలో శవమై కనిపించింది.
రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు ఇద్దరు ఉద్యోగులను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ కేసు మహిళలపై హింసకు మాత్రమే కాకుండా, నేరం, రాజకీయ పలుకుబడి,పరిపాలనా పారదర్శకత లేకపోవడం వంటి అంశాల కలయికకు ప్రతీకగా మారింది. అంకిత అదృశ్యం అయిన ఘటనలో ఫిర్యాదు దాఖలు చేయడంలో జాప్యం, రిసార్ట్లోని కొన్ని భాగాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం, తగలబెట్టడం (దీనిని చాలామంది సాక్ష్యాలను నాశనం చేయడంగా భావించారు), ఆమె మరణానికి కొద్దికాలం ముందు ఒక “విఐపి” అంకితపై లైంగిక సంబంధాల కోసం ఒత్తిడి చేశారనే ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
పాలక బీజేపీతో సంబంధాలున్న పుల్కిత్ ఆర్య కుటుంబానికి చెందిన అతడు, సుదీర్ఘ విచారణ తర్వాత 2025లో మరో ఇద్దరు సహ నిందితులతో పాటు దోషిగా తేలాడు, కానీ ఈ శిక్షలు తెరవెనుక ఉన్న శక్తివంతమైన వ్యక్తుల పాత్రపై ప్రజల ఆందోళనలను తగ్గించలేకపోయాయి.
2025 చివరిలో లీకైన ఆడియో క్లిప్లు, వైరల్ సోషల్ మీడియా పోస్ట్లు ‘విఐపి’ కోణాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడంతో ఆ ఆందోళనలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఇది ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీలో కూడా కొత్త నిరసనలకు దారితీసింది. ప్రభావవంతమైన వ్యక్తులను రక్షించారా లేదా అనే విషయాన్ని కేవలం కేంద్ర దర్యాప్తు మాత్రమే పూర్తిగా వెలికితీయగలదని వాదిస్తూ, దర్యాప్తును రాష్ట్ర ఏజెన్సీల నుండి తొలగించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నివాసం వెలుపల నిరసనలు తీవ్రమయ్యాయి, అంకిత స్మృతిలో కొవ్వొత్తులు వెలిగించారు, డెహ్రాడూన్, హరిద్వార్లలో న్యాయం కోసం నినాదాలు మారుమోగాయి, రాష్ట్ర ప్రభుత్వం అసౌకర్యమైన నిజాలను పూడ్చిపెట్టడానికి ప్రయత్నిస్తోందని పౌర సమాజ సమూహాలు ఆరోపించాయి. కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్)తో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ డిమాండ్కు మద్దతు ఇవ్వగా, రాష్ట్ర బీజేపీ తమ ప్రత్యర్థులు ఒక విషాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది.
ఈ నేపథ్యంలోనే, జనవరి 7న ధామి రహస్యంగా అంకిత తల్లిదండ్రులను డెహ్రాడూన్కు పిలిపించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాతే దాని గురించి బహిరంగంగా వెల్లడించారు. ఈ చర్చల సమయంలో, అంకిత కుటుంబం ధామి ముందు మూడు డిమాండ్లను ఉంచింది: ఏదైనా సీబీఐ విచారణ సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలి; దర్యాప్తు పరిధి రాష్ట్ర ఏజెన్సీలు ఇప్పటికే పరిశీలించిన దానికంటే విస్తరించాలి; అంకిత మరణానికి కారణమని తాము భావిస్తున్న ‘విఐపి’ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయాలి.
ముఖ్యమంత్రి సొంత మాటలే ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలో పడేశాయని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ఇంద్రేష్ మైఖూరి వాదిస్తున్నారు. “తాను నిర్ణయం తీసుకునే ముందు అంకిత కుటుంబంతో మాట్లాడతానని ధామి స్వయంగా చెప్పారు, కాబట్టి ఇప్పుడు ఆయన సీబీఐ విచారణకు ఆదేశించాలి,” అని మైఖూరి అంటున్నారు.
అయితే, హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం చేసిన రెండు వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదని పేర్కొంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు: అంకిత సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, డోభ–శ్రీకోట్ నర్సింగ్ కళాశాలకు ఆమె పేరు పెట్టడం. “ఈ రెండూ జరగలేదు,” అని ఆయన అన్నారు. “కాబట్టి సీబీఐ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా ఉన్నారు?” అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అంకిత హత్యకేసును సీబీఐకి అప్పగించాలన్న విషయమై సీఎం ధామి మౌనాన్ని మాత్రమే కాకుండా, ఆయన ఉద్దేశాలను కూడా సామాజిక కార్యకర్త చారు తివారీ ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాఖండ్లో మత విద్వేష ప్రసంగాలకు పేరుగాంచిన ఒక వివాదాస్పద బాబా, మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ భార్యగా చెబుతున్న ఊర్మిళ సనావర్తో కలిసి అకస్మాత్తుగా కనిపించడాన్ని ఆయన ప్రస్తావించారు.
సనావర్ తన ‘భర్త’తో జరిపిన ప్రైవేట్ సంభాషణకు సంబంధించిన వైరల్ ఆడియో క్లిప్, ఒక విఐపి ప్రమేయం గురించి ప్రజల్లో ఊహాగానాలను మళ్లీ రేకెత్తించింది. “ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగం, పరిపాలనా వ్యవస్థ గుర్తించలేని ఆ మహిళను ఒక సాధారణ బాబా గుర్తించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం” అని తివారీ అన్నారు.
ఈ కాలంలోనే ఆ బాబా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారని కూడా ఆయన పేర్కొంటూ, ఈ యాదృచ్ఛిక సంఘటనల వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. “అంతేకాకుండా, అంకిత కుటుంబంతో మాట్లాడి, ఆ తర్వాత సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఇదంతా జరిగింది.”
ధామి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు, “సమాజం వీధుల్లోనే ఉంటుంది. న్యాయం కోసం నినాదాలు బిగ్గరగా వినిపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే ప్రజల అనుమానాలకు బీజేపీకి సంబంధించిన వ్యక్తులే కారణమయ్యారు” అని సామాజిక కార్యకర్త తివారీ హెచ్చరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఐపీ పాత్రకు సంబంధించి నిజాన్ని పారదర్శకంగా వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ఇంద్రేష్ మైఖూరి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు: “ప్రజలు ఈ పోరాటమంతా అంకిత కోసమే చేశారు. మూడేళ్లపాటు వారు నిరసనలు తెలిపారు, కోర్టు బయట నిలబడి న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు తాము ప్రజల కళ్లలో దుమ్ము కొట్టగలమని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ భావించకూడదని అభిప్రాయపడ్డారు.”


