బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, ఎన్నికలు మే 25 తర్వాత జరుగుతాయని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేషి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
“గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు స్థానిక సంస్థల ఎన్నికలు మే 25 తర్వాత నిర్వహించనున్నారు. ఓటింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తారు,” అని ఆయన అన్నారు.
రాబోయే జీబీఏ, జిల్లా పరిషత్, తాలూకా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. “రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం…మొత్తం 369 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలన కోసం ప్రచురించారు. తుది నోటిఫికేషన్ మార్చి 16న ప్రచురిస్తామని సంగ్రేషి అన్నారు.
జీబీఏ ఎన్నికల కోసం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. “ఒకవేళ పేరు లేకపోతే, చేర్చడం కోసం నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన పౌరులందరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారో లేదో నిర్ధారించుకోవాలి,” అని ఆయన అన్నారు.
ఈవీఎంలను కేవలం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే ఉపయోగించారని, స్థానిక సంస్థల ఎన్నికలకు వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలనే నిబంధన ఏదీ లేదని సంగ్రేషి అన్నారు. “బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన నొక్కి చెప్పారు.
జిల్లా,తాలూకా ఎన్నికలు మే, జూన్లో జరిగే అవకాశం
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా పరిషత్ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. “ప్రభుత్వం మాకు నియోజకవర్గాల పునర్విభజన నివేదికను సమర్పించాల్సి ఉంది. జనవరి 30న కోర్టులో విచారణకు రానున్న ఒక పిటిషన్ కూడా ఉంది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మేము యోచిస్తున్నాము,” అని ఆయన అన్నారు.
బ్యాలెట్ పత్రాల ద్వారా లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తూ చాలా మంది మాకు లేఖలు రాశారు. అయితే, బ్యాలెట్ పత్రాలే మరింత సముచితమైనవని ఆయన నొక్కి చెప్పారు. కాగా, గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలో బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు వెస్ట్ ఐదు మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుకొని 369 వార్డులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.


